AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ : రెండో వన్డేలోనూ టీమిండియా ఘోర పరాజయం.. చేజారిన సిరీస్..

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఘారపరాజయం పాలైంది.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ : రెండో వన్డేలోనూ టీమిండియా ఘోర పరాజయం.. చేజారిన సిరీస్..
Shiva Prajapati
| Edited By: Venkata Narayana|

Updated on: Nov 29, 2020 | 9:57 PM

Share

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఘారపరాజయం పాలైంది. 390 పరుగల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 338/9 పరుగులు మాత్రమే చేసి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ ఆసిస్ కైవసం అయ్యింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమ్.. నిర్ణీత 50 ఓవర్లలో 389/4 పరుగుల చేసి 390 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనతో క్రీజ్‌లోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ ప్లేయర్లలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83 పరుగులు, ఆరోన్ ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులతో రాణించారు. ఫించ్ తరువాత వచ్చిన స్మిత్ భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు. 64 బంతుల్లోనే 104 పరుగులు చేసి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు లక్సెంబర్గ్ 61 బంతుల్లో 70 పరుగులు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు స్కోరును భారీగా పెంచారు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన కంగారూలు 389 పరుగులు చేసి 390 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచారు.

ఇక భారీ లక్ష్య ఛేదనతో రంగంలోకి దిగిన టీమిండియా ప్లేయర్లలో ఓపెనర్లు శిఖర్ ధవన్ 30 పరుగులు, మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేసి ఆరంభంలోనే నిరాశపరిచారు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ టీమిండియాను గెలిపించేందుకు శ్రమించాడు. 87 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయినప్పటికీ కోహ్లీ శ్రమ వృధా అయ్యింది. కేఎల్ రాహుల్ సైతం బాగానే పోరాడాడు. 66 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరిగేందుకు కృషి చేశాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేయగా, పాండ్యా 28, జడేజా 21 పరుగులు చేశారు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేసి 51 పరుగుల తేడాతో ఓడిపోయారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ఆసిస్ వశమైపోయింది.