AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ROKO : రోకో 2027 వరల్డ్ కప్ ఆడతారా? పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

ROKO : 2027 వన్డే వరల్డ్ కప్‌ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిట్‌నెస్, అనుభవం ఉంటే ఇద్దరూ భారత్‌కు ఇంకా ఎన్నో విజయాలు అందిస్తారని పేర్కొన్నారు.

ROKO : రోకో 2027 వరల్డ్ కప్ ఆడతారా? పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
Roko
Rakesh
|

Updated on: Jul 29, 2026 | 8:48 AM

Share

ROKO : భారత క్రికెట్ జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అనే అంశంపై క్రికెట్ వర్గాల్లో నిరంతరం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆసియా బ్రాడ్‌మన్‌గా పేరొందిన జహీర్ అబ్బాస్ ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లకు తన పూర్తి మద్దతు తెలిపారు. రోహిత్, విరాట్‌లలో ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన చేసే సత్తా ఉందని, వారు ఫిట్‌గా ఉంటే రాబోయే వన్డే ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వయసు కాదు.. ఫిట్‌నెస్, ప్రదర్శనే ముఖ్యం

ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన జహీర్ అబ్బాస్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లను కేవలం వయసును బట్టి జట్టుకు దూరం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆటగాడు ఫిట్‌గా ఉండి, మ్యాచ్‌ల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నంత కాలం జట్టులో అతని స్థానానికి ఎలాంటి డోకా ఉండదని చెప్పారు. విరాట్, రోహిత్ ఇద్దరూ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాటర్లని, బిగ్ టోర్నమెంట్లలో వారి అనుభవం భారత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

విరాట్ ఫిట్‌నెస్‌పై ప్రశంసలు.. రోహిత్‌కు చిన్న సలహా

విరాట్ కోహ్లీ శారీరక దృఢత్వంపై జహీర్ అబ్బాస్ ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ ఇప్పటికీ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, అతను ఇప్పట్లో క్రికెట్‌కు దూరమయ్యే ప్రసక్తే లేదని, చాలా కాలం పాటు ఆడగలడని కొనియాడారు. ఇక రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. రోహిత్ బ్యాటింగ్ క్లాస్ ఇప్పటికీ అత్యుత్తమంగా ఉందన్న ఆయన, కాకపోతే తన ఫిట్‌నెస్‌పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందని సలహా ఇచ్చారు. ఫిట్‌నెస్‌ సరిగ్గా ఉంటే రోహిత్ కూడా 2027 వరల్డ్ కప్ వరకు సులువుగా ఆడగలడని ధీమా వ్యక్తం చేశారు.

బిగ్ టోర్నీల్లో భారత్‌కు అనుభవమే ఆయుధం

2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల ప్రాతినిధ్యం చాలా కీలకమని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని జయించే అనుభవం వారి సొంతమని, అది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇప్పటికీ ఇద్దరిలో ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సామర్థ్యం ఉందని, ఇలాంటి ఆటగాళ్లే ఏ జట్టుకైనా అసలైన బలమని కొనియాడారు.

రోహిత్ బ్యాటింగ్ టైమింగ్‌కు ఫిదా

రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిపై ప్రత్యేకంగా మాట్లాడిన జహీర్ అబ్బాస్, ఇటీవల ఇంగ్లాండ్‌పై రోహిత్ సాధించిన సెంచరీని చూడటం ఎంతో ముచ్చటగా అనిపించిందని గుర్తు చేసుకున్నారు. రోహిత్ క్రీజులో బాదే షాట్లు, అతని టైమింగ్ ఎంతో సహజంగా ఉంటాయని, అతడి బ్యాటింగ్‌ను వీక్షించడం ఎప్పుడూ ఒక అద్భుతమైన అనుభూతినిస్తుందని చెప్పారు. కాగా, సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 వన్డే వరల్డ్ కప్‌పై ఇప్పటినుంచే అంచనాలు మొదలవ్వగా, జహీర్ అబ్బాస్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us