Virat Kohli: టెస్టు ఫార్మాట్లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఏమన్నాడంటే?
Virat Kohli Test Cricket Retirement: విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం కోట్ల మంది అభిమానులను నిరాశకు గురిచేసినప్పటికీ, ఆయన స్పష్టతను క్రికెట్ ప్రపంచం గౌరవిస్తోంది. టెస్టు క్రికెట్కు దూరమైనా, మిగిలిన ఫార్మాట్లలో కోహ్లీ తనదైన శైలిలో దూసుకుపోవాలని, మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిద్దాం.

Virat Kohli Test Cricket Retirement: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. టెస్టు క్రికెట్లోకి మళ్లీ పునరాగమనం చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, సుదీర్ఘ ఫార్మాట్కు తాను పూర్తిగా గుడ్బై చెప్పేశానని, ఇక ఆ అధ్యాయం ముగిసినట్లేనని కోహ్లీ భావోద్వేగంగా ప్రకటించారు.
టెస్టు క్రికెట్కు కోహ్లీ శాశ్వత వీడ్కోలు..!
భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చారు. గతేడాది మే నెలలోనే సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, మరోసారి వైట్ జెర్సీలో కనిపిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తన సొంత క్రీడా బ్రాండ్ ‘వన్8’ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హోస్ట్ డానిష్ సైత్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఈ బ్రాండ్కు చెందిన ఒక ప్రత్యేక షూ ధర రూ.9,230 గా ఉందని, కోహ్లీ టెస్టు పరుగుల సంఖ్య కూడా సరిగ్గా 9,230 కావడం విశేషమని గుర్తు చేశారు. వ్యాపార లాభాల కోసమైనా, పరుగుల సంఖ్యను పెంచడానికైనా మళ్లీ టెస్టుల్లోకి వస్తారా అని సరదాగా ప్రశ్నించగా.. కోహ్లీ అంతే నవ్వుతూ బదులిచ్చారు. “వ్యాపారం కోసం ఉత్పత్తులను తక్కువ ధరకే అమ్ముకోవడానికైనా సిద్ధమే కానీ, టెస్టు క్రికెట్ లోకి మాత్రం తిరిగి రాను. నా పని అయిపోయింది, ధన్యవాదాలు” అంటూ కుండబద్దలు కొట్టారు.
సుదీర్ఘ కెరీర్.. అద్భుత రికార్డులు
దాదాపు 14 ఏళ్ల పాటు సాగిన విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్ అత్యంత అద్భుతంగా సాగింది. ప్రపంచంలోని అత్యంత కఠినమైన పిచ్లపై సైతం పరుగుల వరద పారించిన ఘనత ఆయనది. తన సుదీర్ఘ ప్రయాణంలో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 శతాబ్దాలు, 31 అర్ధ శతాబ్దాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత కోహ్లీ నాల్గవ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా 2016 నుంచి 2019 మధ్య కాలంలో కోహ్లీ కెరీర్ పీక్స్ లో సాగింది. ఆ నాలుగేళ్లలోనే 43 టెస్టుల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశారు. ఇందులో ఏకంగా 7 ద్విశతకాలు ఉండటం విశేషం. టెస్టు చరిత్రలో ఒక కెప్టెన్గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటికీ కోహ్లీ పేరిటే ఉంది.
కెప్టెన్గా తిరుగులేని రికార్డు..
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచారు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్ర సింగ్ ధోనీ గాయపడటంతో తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన కోహ్లీ, ఆ తర్వాత జట్టును అగ్రపథంలో నడిపించారు. ఆయన నేతృత్వంలో భారత్ ఆడిన 68 టెస్టుల్లో ఏకంగా 40 మ్యాచ్ల్లో విజయం సాధించింది. విదేశీ గడ్డపై, ముఖ్యంగా సేన (SENA) దేశాల్లో భారత్ టెస్టుల్లో ఆధిపత్యం చలాయించడానికి కోహ్లీ దూకుడు నైజమే ప్రధాన కారణం.
ఢిల్లీ నా మాతృభూమి.. ఇక్కడే నా ప్రయాణం మొదలైంది..
సొంత మైదానమైన ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానుల కోలాహలం మధ్య కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. “నేను ఢిల్లీలోనే పుట్టాను, నా క్రికెట్ ప్రయాణం ఇక్కడే మొదలైంది. నా గుండెల్లో ఢిల్లీకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత నా కలల బ్రాండ్ వన్8ను ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నిజమవుతుందని నేను అనుకోలేదు, కానీ అభిమానులు నాపై చూపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చింది” అని కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




