Virat kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. వన్డేలకు సిద్దమవుతున్న కోహ్లీ.. బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదటుపెట్టిన విరాట్!
టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లీ తన విరామానికి గుడ్బై చెప్పారు. రాబోయే వన్డే అంతర్జాతీయ మ్యాచ్ల బరిలో దిగేందుకు సిద్దమవుతున్నాడు. ఇందుకోసం మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదటుపెట్టాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న కోహ్లీ, నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. టెస్టులు, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే గుడ్బై చెప్పిన విరాట్.. ఇకపై తన పూర్తి దృష్టిని వన్డే క్రికెట్పై మాత్రమే పెట్టనున్నారు.

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి ప్రాక్టీస్ ప్రారంభించాడు. రాబోయే వన్డే అంతర్జాతీయ మ్యాచ్ల బరిలో దిగేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం లండన్లో పర్యటనలో ఉన్న కోహ్లీ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ అయిన నయీమ్ అమీన్తో పాటు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ప్రాక్టీస్ తర్వాత నయీమ్ అమీన్తో కలిసి దిగిన ఫోటోను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. ఆ స్టోరీలో కోహ్లీ ఇలా రాసుకొచ్చారు. ప్రాక్టీస్లో సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అయితే భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్తో మూడు వన్డేల సరీస్ ఆడాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్ వాయిదా పడింది. ఈ సిరీస్ 2026 సెప్టెంబర్లో నిర్వహించాలని బీసీసీఐతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయింది. దీంతో ఆగస్ట్లోనే కోహ్లీని మైదానంలో చూద్దామనుకున్న అభిమానులు ఆశలు అడియాశలైపోయాయి. అయితే తమ అభిమాన క్రికెటర్ను మళ్లీ మైదానంలో చూడాలంటే ఫ్యాన్స్ అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్తో కోహ్లీ తిరిగి భారత జట్టులోకి రానున్నారు. ఈ సిరీస్తో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా భాగం కానున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




