Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన గౌతమ్ గంభీర్ క్యాంప్.. స్పిన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi : శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన వివాదంలో వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై గౌతమ్ గంభీర్ కోచింగ్ క్యాంప్ స్పందించింది. స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే శ్రీలంక ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, యువ ఆటగాడు తన బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు.

Vaibhav Sooryavanshi : శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్లో ఇండియా-ఎ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆట పరంగా కంటే.. మైదానంలో జరిగిన ఒక పెద్ద గొడవ కారణంగానే వార్తల్లో నిలిచాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన గత మ్యాచ్లో వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో తీవ్రమైన ఆన్ఫీల్డ్ ఫైట్కు దిగాడు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో.. టీమిండియా సీనియర్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ మేనేజ్మెంట్ దీనిపై అధికారికంగా స్పందించింది. బుధవారం మధ్యాహ్నం అఫ్గానిస్తాన్తో జరగబోయే రెండో వన్డే మ్యాచ్కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఈ గొడవపై తన వర్డిక్ట్ ఇచ్చారు.
అసలు మైదానంలో ఏం జరిగింది?
ఈ త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు 265 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడింది. అయితే హోస్ట్ టీమ్ అయిన శ్రీలంక కూడా సరిగ్గా 265 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో లంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ శెడ్గేలు విఫలమయ్యారు. దీనితో శ్రీలంక విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో లంక ఆటగాళ్లు హద్దులు దాటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఒక లంక ప్లేయర్ భారత ఓపెనర్ వైభవ్ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో బూతులు తిట్టాడు. దీనితో కోపంతో ఊగిపోయిన 15 ఏళ్ల వైభవ్ లంక ప్లేయర్తో శారీరక ఘర్షణకు దిగాడు, మిగతా ప్లేయర్స్ వచ్చి వారిని విడదీశారు.
లంక ప్లేయర్లకు కూడా బుద్ధి ఉండాలి
గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్లో కీలక సభ్యుడైన సాయిరాజ్ బహుతులే ఈ విషయంపై మాట్లాడుతూ శ్రీలంక టీమ్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “మైదానంలో అలా జరగడం నిజంగా దురదృష్టకరం. అయితే వైభవ్ ఇంకా చాలా చిన్న పిల్లాడు, అతనికి విషయాలు అర్థమయ్యేలా చెప్పడానికి ఇండియా-ఎ టీమ్తో పాటు చాలా మంది అనుభవజ్ఞులైన కోచ్లు ఉన్నారు. కానీ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. మైదానంలో ఎలా ప్రవర్తించాలో, ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎలా గౌరవం ఇవ్వాలో శ్రీలంక ఆటగాళ్లకు కూడా అక్కడి బోర్డు పాఠాలు నేర్పించాలి. కేవలం మనవాళ్లను మాత్రమే అనడం సరికాదు” అని బహుతులే ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ దెబ్బకు గొడవకు కారణమైన లంక బౌలర్ తన సోషల్ మీడియా అకౌంట్ను కూడా ప్రైవేట్గా మార్చుకోవాల్సి వచ్చింది.
ఐపీఎల్ హీరో.. ఇండియా-ఎ లో జీరో?
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే అతనికి ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లతో పాటు ఇండియా-ఎ జట్టులో కూడా చోటు దక్కింది. అయితే ఈ లంక టూర్లో మాత్రం వైభవ్ బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మొదటి మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేసిన వైభవ్, అఫ్గాన్పై 44 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇక మూడో మ్యాచ్లో కేవలం 21 పరుగులకే లంక బౌలర్ల వలలో చిక్కి పెవిలియన్ చేరాడు. ఈ గొడవలను పక్కన పెట్టి వైభవ్ తన బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని గంభీర్ క్యాంప్ సూచించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
