AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : 15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు టీమిండియాలో పెరిగిన పోటీ… రెండు నెలల్లో ఫామ్ దొరకకపోతే అభిషేక్‌కు కష్టమే

Abhishek Sharma : జింబాబ్వే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన అభిషేక్ శర్మపై ఒత్తిడి పెరుగుతోంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డు ప్రదర్శనతో టీమిండియా ఓపెనింగ్ పోటీ మరింత తీవ్రం కాగా, వచ్చే రెండు నెలలు అభిషేక్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి.

Abhishek Sharma : 15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు టీమిండియాలో పెరిగిన పోటీ... రెండు నెలల్లో ఫామ్ దొరకకపోతే అభిషేక్‌కు కష్టమే
Abhishek Sharma
Rakesh
|

Updated on: Jul 28, 2026 | 8:22 AM

Share

Abhishek Sharma : జింబాబ్వేతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ (50) చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అతను, రెండో మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులు, చివరి మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగులతో విధ్వంసం సృష్టించి సిరీస్‌ను అద్భుతంగా ముగించాడు.

అభిషేక్ శర్మ ఫామ్‌పై తీవ్ర ఆందోళన

ఒకవైపు వైభవ్ సూర్యవంశీ మెరుపులతో దూసుకుపోతుంటే, మరోవైపు అతని ఓపెనింగ్ పార్టనర్ అభిషేక్ శర్మ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు జింబాబ్వే సిరీస్ తీవ్ర నిరాశను మిగిల్చింది. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 8, 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఈ సిరీస్ మాత్రమే కాకుండా, ఇటీవల యుకే (UK) పర్యటనలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన మ్యాచ్‌లలోనూ అభిషేక్ ఘోరంగా తడబడ్డాడు. టీమిండియా తరఫున ఆడిన గత ఆరు టీ20 ఇన్నింగ్స్‌లలో అతను 10, 16, 3, 1, 8, 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇది అతని కెరీర్‌లో ఎదురవుతున్న తీవ్రమైన ఫామ్ లేమికి అద్దం పడుతోంది.

సోషల్ మీడియాలో అభిషేక్ భావోద్వేగ పోస్ట్

సిరీస్ ముగిసిన తర్వాత తన పేలవ ప్రదర్శనపై అభిషేక్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. “ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకోలేకపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ క్రీడలు ఎప్పుడూ నిరంతరం శ్రమించే వారికే సరైన ప్రతిఫలాన్ని ఇస్తాయి. జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మరింత బలంగా పునరాగమనం చేస్తాను” అని రాసుకొచ్చాడు. అయితే జట్టులో పోటీ తీవ్రంగా మారడం అభిషేక్‌పై అదనపు ఒత్తిడిని పెంచుతోందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఓపెనింగ్ స్థానానికి పెరిగిన పోటీ

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. దీనికి తోడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వేగంగా ఎదగడంతో టీమిండియా ఓపెనింగ్ స్పాట్ కోసం పోటీ తీవ్ర రూపం దాల్చింది. భారత్ తన తదుపరి టీ20 మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్‌లో, ఆ తర్వాత అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్‌లో ఆడనుంది. దీంతో తన లోపాలను సరిదిద్దుకుని, కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పుంజుకోవడానికి అభిషేక్ శర్మకు రెండు నెలలకు పైగా సమయం లభించనుంది. తీవ్రమైన సాధనతో మళ్లీ పాత ఫామ్‌ను అందుకోవడమే అతని ముందున్న ఏకైక మార్గం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us