AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Final : అహ్మదాబాద్‌లో అలజడి.. ఐపీఎల్ ఫైనల్‌కు ఊహించని గెస్ట్

IPL 2026 Final vaibhav suryavanshi : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అహ్మదాబాద్ చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌ల నుంచి అతడి ఆరెంజ్ క్యాప్‌కు గట్టి పోటీ నెలకొంది.

IPL 2026 Final : అహ్మదాబాద్‌లో అలజడి.. ఐపీఎల్ ఫైనల్‌కు ఊహించని గెస్ట్
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 31, 2026 | 6:17 PM

Share

IPL 2026 Final : ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. అయితే ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ఫైనల్‌కు చేరనప్పటికీ, ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం అహ్మదాబాద్‌లో తళుక్కున మెరిశాడు. ప్లేఆఫ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ టీనేజ్ సెన్సేషన్, నేడు జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు చూపించిన అసాధారణ ప్రదర్శనకు గాను స్టేడియంలో అతడిని సత్కరించే అవకాశం కూడా ఉంది.

ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు సాధించాడు. ఇతడి ఊచకోత వల్లే రాజస్థాన్ జట్టు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 లో కూడా ఒంటరి పోరాటం చేస్తూ 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 96 పరుగులు చేసి జట్టుకు 214 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

వైభవ్ సూర్యవంశీ క్వాలిఫయర్-2 లో అద్భుతంగా ఆడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కలేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు కంప్లీట్ డామినేషన్‌తో రాజస్థాన్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా ఛేజ్ చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 104 పరుగులతో సెంచరీ బాదగా, ఓపెनर సాయి సుదర్శన్ 58 పరుగులతో అదరగొట్టాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు అతడిని ఫైనల్ మ్యాచ్ వేదికపై ప్రత్యేకంగా సత్కరించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సీజన్ ముగిసే సమయానికి ఆరెంజ్ క్యాప్ అతడి వద్దే ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ టోర్నీ నుండి అవుట్ అయినందున వైభవ్‌కు ఇక మ్యాచ్‌లు లేవు. కానీ, రన్నర్ల జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. వీరిద్దరూ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం 15 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో 722 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 163.71 గా ఉండగా, టోర్నీలో ఇప్పటివరకు 72 ఫోర్లు, 33 సిక్సర్లు బాదాడు. నేటి ఫైనల్ మ్యాచ్‌లో గిల్ మరో 55 పరుగులు చేస్తే వైభవ్ సూర్యవంశీ (776) రికార్డును బ్రేక్ చేసి ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకుంటాడు.

మరోవైపు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా అత్యంత స్థిరమైన ప్రదర్శనతో 16 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీలతో 710 పరుగులు చేశాడు. ఇతడి సగటు 47.33 కాగా, టోర్నీలో 73 ఫోర్లు, 30 సిక్సర్లు కొట్టాడు. నేటి మ్యాచ్‌లో సుదర్శన్ కనుక 67 పరుగులు చేస్తే వైభవ్‌ను అధిగమిస్తాడు. ఒకవేళ సాయి సుదర్శన్ ఈ ఆరెంజ్ క్యాప్ గెలిస్తే, ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ తర్వాత వరుసగా రెండు ఐపీఎల్ ఎడిషన్లలో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రెండో బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us