రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
అర్ధరాత్రి దాటినా సరే.. ఘుమఘుమలాడే బిర్యానీ ప్లేటు ముందుంటే చాలా మంది లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. ముఖ్యంగా నేటి యువతకు ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్స్లో లేట్ నైట్ బిర్యానీ లాగించడం ఒక క్రేజీ ట్రెండ్గా మారిపోయింది. నాలుకకు రుచిగా ఉంది కదా అని రాత్రి 10 గంటల తర్వాత లాగించేసే ఈ మసాలా బిర్యానీ, లోపల మన శరీర జీర్ణవ్యవస్థను ఎంత ఘోరంగా దెబ్బతీస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే లేట్ నైట్ బిర్యానీ అలవాటుపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిర్యానీలో కేలరీలు, కొవ్వు పదార్థాలు, ఘాటైన మసాలాలు, మాంసం అధిక మోతాదులో ఉంటాయి. పగటి సమయంతో పోలిస్తే రాత్రి వేళల్లో శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా మందగిస్తుంది. రాత్రి ఆలస్యంగా బిర్యానీ తినడం వల్ల అది జీర్ణం కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, తీవ్రమైన అసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థపై పడే అధిక భారం రాత్రి నిద్రపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
రాత్రిపూట తరచూ ఆలస్యంగా బిర్యానీ తినే అలవాటు ఉంటే శరీరంలో అనవసరమైన కేలరీలు పేరుకుపోయి బరువు వేగంగా పెరుగుతారు. నిద్రలేమి కారణంగా శరీర జీవక్రియలు దెబ్బతిని రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా షుగర్, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అసిడిటీ సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట బిర్యానీ తినడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఒకవేళ పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాల్లో రాత్రిపూట బిర్యానీ తినడం తప్పనిసరి అయితే కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి
మితంగా తినండి: ప్లేట్ నిండా కాకుండా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బిర్యానీని తీసుకోండి.
వెంటనే పడుకోవద్దు: తిన్న వెంటనే నిద్రపోకుండా, కనీసం 2 నుంచి 3 గంటల సమయం గడిచిన తర్వాతే పడుకోవాలి.
పెరుగు, సలాడ్స్ జోడించండి: జీర్ణక్రియ సులువుగా జరగడానికి బిర్యానీతో పాటు రైతా లేదా పచ్చి కూరగాయల సలాడ్లను ఎక్కువగా చేర్చుకోండి.
తేలికపాటి నడక: భోజనం ముగిసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
కూల్ డ్రింక్స్ వద్దు: బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి, ఎందుకంటే అవి జీర్ణక్రియను మరింత దెబ్బతీస్తాయి.
