Vaibhav Sooryavanshi: “ఈషాన్ కిషన్ను చూసి నేర్చుకో!”.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ 270 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. ఈ రికార్డు ఇన్నింగ్స్ను ఉదాహరణగా చూపిస్తూ, యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడటం ఎలాగో ఈషాన్ నుంచి నేర్చుకోవాలంటూ భారత మాజీ క్రికెటర్ వివేక్ రజ్దాన్ వ్యాఖ్యానించడం క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Vaibhav Sooryavanshi: చెన్నై వేదికగా సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కిషన్ 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 270 పరుగులు సాధించాడు. ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్లో 708 పరుగుల కొండంత స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈస్ట్ జోన్ వైపు నుంచి డబుల్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్గా అరుణ్ లాల్, సబా కరీమ్ సరసన ఈషాన్ నిలిచాడు. అంతేకాకుండా ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఈస్ట్ జోన్ కెప్టెన్-వికెట్ కీపర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ ఆరంభించిన యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 44 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించినప్పటికీ ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్గా మలచలేకపోయాడు. దీనిపై కామెంట్ బాక్స్ నుంచి స్పందించిన మాజీ క్రికెటర్ వివేక్ రజ్దాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “సూర్యవంశీ గారూ.. ఇప్పుడు మీరు ఈషాన్ కిషన్ లాంటి ప్లేయర్లను చూసి నేర్చుకోవాల్సి ఉంది. క్రీజులో సెట్ అయిన తర్వాత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం” అని హితవు పలికాడు. చెన్నై తీవ్రమైన ఎండలో అంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం కేవలం టెక్నిక్, సహనంతోనే కాకుండా అద్భుతమైన ఫిట్నెస్తోనే సాధ్యమవుతుందని ప్రశంసించాడు.
మొదటి రోజు 385/4 స్కోరు వద్ద ఆటను ప్రారంభించిన ఈస్ట్ జోన్ జట్టుకు ఈషాన్ కిషన్, కుమార్ కుషాగ్ర జోడీ కొండంత అండగా నిలిచింది. ఐదో వికెట్కు వీరిద్దరూ కలిసి ఏకంగా 230 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కుషాగ్ర 128 బంతుల్లో తన తొలి దులీప్ ట్రోఫీ సెంచరీ పూర్తి చేసుకుని 101 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అనంతరం అనుకూల్ రాయ్తో కలిసి కిషన్ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. దాదాపు 250 పరుగులు దాటిన తర్వాత కిషన్ రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు.
ఆఖరి వికెట్లలో అనుకూల్ రాయ్ 45 రన్స్, మహమ్మద్ షమీ 28 రన్స్ చేయడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌట్ అయింది. సౌత్ జోన్ బౌలర్లు మ్యాచ్లోకి రావడానికి తీవ్రంగా శ్రమించినా ఈస్ట్ జోన్ బ్యాటర్ల ఉధృతిని అడ్డుకోలేకపోయారు. దీంతో సౌత్ జోన్ ముందు కొండంత స్కోరు నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
