AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా ఫైనల్ బెర్త్ ఫిక్స్.. కివీస్ లక్‌తో నేరుగా ట్రోఫీ మ్యాచ్‌కే.. ఈ గణాంకాలు చూస్తే షాకే..

Women's World Cup 2025 Final: ప్రస్తుతం జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇదే తరహా అద్భుతం జరిగింది. సెమీ-ఫైనల్స్‌లో నాలుగో స్థానం కోసం ఇరు జట్లు తలపడిన కీలక లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది.

Team India: టీమిండియా ఫైనల్ బెర్త్ ఫిక్స్.. కివీస్ లక్‌తో నేరుగా ట్రోఫీ మ్యాచ్‌కే.. ఈ గణాంకాలు చూస్తే షాకే..
Team India Wwc 2025
Venkata Chari
|

Updated on: Oct 24, 2025 | 1:25 PM

Share

Team India: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో (ICC Women’s World Cup) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న సంబంధం కేవలం ఒక గెలుపు-ఓటమికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా, సెమీ-ఫైనల్ బెర్త్ కోసం ‘డూ ఆర్ డై’ (Do-or-Die) మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు, ఆ తరువాత భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవడం ఒక ప్రత్యేకమైన ‘సెంటిమెంట్‌’గా మారింది.

ప్రస్తుతం జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇదే తరహా అద్భుతం జరిగింది. సెమీ-ఫైనల్స్‌లో నాలుగో స్థానం కోసం ఇరు జట్లు తలపడిన కీలక లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతోనే, మహిళల ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై సాధించిన ప్రతి కీలక విజయం భారత జట్టును నేరుగా ఫైనల్‌కు తీసుకెళ్లిన ఆసక్తికరమైన చరిత్రను ఒకసారి పరిశీలించాలి.

గతంలో జరిగిన కీలక పోరాటాలు..

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌లో రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఆ రెండు సందర్భాల్లోనూ, టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం కీలక మలుపుగా మారింది.

ఇవి కూడా చదవండి

1. 2005 ప్రపంచకప్ (దక్షిణాఫ్రికా): ఈ ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో కఠినమైన జట్లతో పోరాడింది. కాగా, భారత జట్టు సెమీ-ఫైనల్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను 40 పరుగుల తేడాతో ఓడించింది. రమేశ్ పవర్ కోచింగ్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుతంగా ఆడింది. న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత, భారత్ తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

2. 2017 ప్రపంచకప్ (ఇంగ్లాండ్): 2017 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం మళ్లీ ఉత్కంఠగా సాగింది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ సెమీస్ బెర్త్‌ను నిర్ణయించే ‘క్వార్టర్ ఫైనల్’ లాంటిది. డెర్బీలో జరిగిన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి బ్యాటింగ్‌తో చెలరేగిపోగా, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత్ 186 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయం తర్వాత భారత్ సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి కప్ కోల్పోయింది.

3. 2025 ప్రపంచకప్ (భారత్): సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీ-ఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ వర్చువల్ నాకౌట్‌లో స్మృతి మంధాన, ప్రతీక రావల్ మెరుపు సెంచరీలు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని ఛేదించలేక న్యూజిలాండ్ ఓటమి పాలైంది. భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు, చారిత్రక గణాంకాలు, సెంటిమెంట్‌ల ప్రకారం, న్యూజిలాండ్‌ను కీలక మ్యాచ్‌లో ఓడించడం ద్వారా భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు మెరుగయ్యాయి.

ఈ ఆసక్తికరమైన గణాంకాలను పరిశీలిస్తే, మహిళల క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను కీలక మ్యాచ్‌లో ఓడించినప్పుడల్లా భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈసారి కూడా భారత్ సెంటిమెంట్‌ను కొనసాగించి, తొలిసారి కప్పును గెలుచుకుంటుందో లేదో చూడాలి!

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..