T20 World Cup 2026 : 61 పరుగుల తేడాతో లంక చిత్తు.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన న్యూజిలాండ్!
T20 World Cup 2026 : కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరులో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం శ్రీలంకతో జరిగిన ఈ కీలక మ్యాచ్లో కివీస్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్తుకు మరింత చేరువయ్యింది.

T20 World Cup 2026 : కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరులో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం శ్రీలంకతో జరిగిన ఈ కీలక మ్యాచ్లో కివీస్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్తుకు మరింత చేరువయ్యింది. ఈ గెలుపు న్యూజిలాండ్ క్యాంప్లో ఉత్సాహాన్ని నింపగా, పాకిస్థాన్కు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రూప్-2లో ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ సీటును ఖాయం చేసుకోగా, మిగిలిన ఒక్క స్థానం కోసం ఇప్పుడు కివీస్, పాక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ప్రస్తుత ఈక్వేషన్స్ బట్టి చూస్తే పాక్ కంటే న్యూజిలాండ్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
శ్రీలంక ఓటమితో ఆ జట్టు ఈ మెగా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇదే సమయంలో పాకిస్థాన్ ఆశలు అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పాక్ సెమీస్కు చేరుకోవాలంటే న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్లలో ఓడిపోవాలని ఆశించింది. కానీ శ్రీలంకపై కివీస్ సాధించిన ఈ భారీ విజయంతో పాక్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం సూపర్-8 గ్రూప్-2 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 3 పాయింట్లతో మెరుగైన స్థానంలో ఉండగా, పాకిస్థాన్ కేవలం ఒకే ఒక్క పాయింట్తో మూడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. కివీస్ రన్ రేట్ కూడా భారీగా పెరగడంతో వారిని దాటడం పాకిస్తానీలకు తలకు మించిన భారంగా మారింది.
సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇప్పుడు పాకిస్థాన్ చేతిలో ఉన్న ఏకైక మార్గం.. తమ తదుపరి మ్యాచ్లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించడమే. అయితే కేవలం గెలిస్తే సరిపోదు, న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్లో బలమైన జట్టు అయిన ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడిపోయి, శ్రీలంకపై పాక్ గెలిస్తే.. అప్పుడు రెండు జట్లకు చెరో 3 పాయింట్లు లభిస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్కు వెళ్లే రెండో జట్టు ఎవరో తేలుతుంది. కానీ న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ ప్రస్తుతం చాలా బలంగా (+3.050) ఉంది, దీనిని అధిగమించడం పాకిస్థాన్కు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి చాలా సాఫీగా ఉంది. వారు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. కివీస్ తన చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడిస్తే నేరుగా 5 పాయింట్లతో సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయినా, న్యూజిలాండ్కు 4 పాయింట్లు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా పాక్ ఇంటికి వెళ్లడం ఖాయం. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే న్యూజిలాండ్ సెమీస్ వెళ్లడం ఖాయమని, పాకిస్థాన్ మరోసారి టోర్నీ మధ్యలోనే బ్యాగులు సర్దుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
