Video: నా కొడుకుని చూసి రెండేళ్లు అవుతుంది! అన్ని దార్లు మూసుకుపోయాయి..గబ్బర్ ఎమోషనల్ వీడియో
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన కొడుకు జోరావర్ను చివరిసారిగా రెండు సంవత్సరాల క్రితం చూసినట్లు వెల్లడించాడు. విడాకుల అనంతరం తన కుమారునితో కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోయినా, ధ్యానం ద్వారా ఆధ్యాత్మికంగా అతనితో సమీపంగా ఉన్నట్లు చెప్పాడు. అతని సందేశాలను కొడుకు చదువుతాడా లేదా అనేదానిని పట్టించుకోకుండా, తండ్రిగా తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఇక క్రికెట్కు గుడ్బై చెప్పిన ధావన్, తన కొడుకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాడు.

భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2023లో తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న ధావన్, తన కుమారుడు జోరావర్ సంరక్షణను కోల్పోయాడు. కేవలం సందర్శన హక్కులు మాత్రమే కలిగినప్పటికీ, అతనికి తన కుమారునితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా పూర్తిగా బ్లాక్ చేయబడినట్లు తెలుస్తోంది. అయితే, ధావన్ తన కొడుకును తలచుకుని, అతనితో ఆధ్యాత్మికంగా ఎలా కనెక్ట్ అవుతున్నాడో వెల్లడించాడు. .. శిఖర్ ధావన్ ANI పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, తన కుమారుని చివరిసారిగా రెండు సంవత్సరాల క్రితం చూసినట్లు, ఒక సంవత్సరం క్రితం చివరిసారిగా మాట్లాడినట్లు వెల్లడించాడు.
“నా కొడుకును మిస్ అవుతున్నాను. కానీ నేను ప్రతి రోజూ అతనితో ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నట్లు భావిస్తాను. ధ్యానం చేస్తూ, అతన్ని కౌగిలించుకుంటున్నట్లు, అతనితో గడిపే ప్రతి క్షణాన్ని మనసులో ఊహించుకుంటాను. నా శక్తిని దానిలో పెట్టడం వల్ల అతనితో మానసికంగా దగ్గరగా ఉన్న అనుభూతి వస్తుంది,” అని ధావన్ ఎమోషనల్గా చెప్పాడు.
ధావన్ తన కొడుకు గురించి ఎంతో ప్రేమతో మాట్లాడుతూ, తనని అన్ని చోట్లా బ్లాక్ చేసినప్పటికీ, తాను ఇప్పటికీ ప్రతి మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి అతనికి సందేశం పంపుతూనే ఉంటాను అని, తన కొడుకు చదువుతాడా లేదా అనేది ధావన్ కు అంతగా ముఖ్యం కాదు. కానీ ఒక తండ్రి బాధ్యతగా, తన ప్రేమగా అతనికి సందేశం పంపడం మాత్రం కొనసాగిస్తాను, అని చెప్పాడు.
తన కుమారుడిని భవిష్యత్తులో కలిసే అవకాశమొస్తే, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదిస్తాడో ధావన్ భావోద్వేగంతో చెప్పాడు. “మొదటిగా అతన్ని కౌగిలించుకుంటాను. అతని మాట వినడానికి ప్రాధాన్యత ఇస్తాను. నా ఇన్నింగ్స్ గురించి చూపించాలనే ఆలోచన నాకు లేదు. అతను తన భావాలను పంచుకుంటే, బహుశా నేను కూడా అతనితో కలిసి ఏడుస్తాను,” అని ధావన్ అన్నాడు.
శిఖర్ ధావన్ తన కొడుకు జోరావర్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, “అతను నా ఇన్నింగ్స్ చూసినా, చూడకపోయినా నాకు సంబంధం లేదు. నాకు అతని ఆనందమే ముఖ్యమైనది. అతను ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను” అని తన ప్రేమను వ్యక్తపరిచాడు.
భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు చేసిన ధావన్, ఆగస్టు 2024లో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని జీవితం క్రీడల్లో ఎన్నో విజయాలు సాధించినా, వ్యక్తిగతంగా తండ్రిగా ఎదుర్కొంటున్న సవాళ్లు అందరికీ హృదయ విదారకంగా మారాయి.
శిఖర్ ధావన్ తన కొడుకును కలిసే రోజు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ తండ్రిగా, తన ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపడం లేదు.
Shikhar Dhawan said, "I still message my son, even though I'm blocked from everywhere". 💔
– An emotional interview of Gabbar!pic.twitter.com/UesiSw3CLU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..