మా నాన్న మరణానికి కరోనా టీకానే కారణం.. సంచలన నిజాలు బయటపెట్టిన షేన్ వార్న్ కుమారుడు..!
Shane Warne: క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెంది నాలుగేళ్లు గడుస్తున్నా, ఆయన మృతిపై అనుమానాలు ఇంకా వీడలేదు. తాజాగా వార్న్ కుమారుడు జాక్సన్ తన తండ్రి మరణంపై నోరు విప్పాడు. కరోనా వ్యాక్సిన్ల వల్లే తన తండ్రి గుండెపోటుకు గురయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Shane Warne: థాయ్లాండ్లో 2022లో షేన్ వార్న్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు తేల్చారు. అయితే, ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జాక్సన్, తన తండ్రి మరణంలో కరోనా టీకాల పాత్ర ఉందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపాడు. తన తండ్రి పని నిమిత్తం బలవంతంగా మూడు లేదా నాలుగు టీకాలు తీసుకోవాల్సి వచ్చిందని, అవే ఆయన ఆరోగ్య పరిస్థితిని దిగజార్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వంపై ఆగ్రహం..
వార్న్ మరణవార్త విన్న వెంటనే తన మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన ప్రభుత్వం, కరోనా టీకాలేనని జాక్సన్ పేర్కొన్నారు. “నా తండ్రికి అంతర్గతంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కానీ ఈ టీకాలు ఆ సమస్యలను ఒక్కసారిగా బయటకు తెచ్చాయి. నా తండ్రి చనిపోయినట్లు ఫోన్ రాగానే నేను తక్షణమే ప్రభుత్వాన్ని, ఆ టీకాలను నిందించాను” అని ఆయన వెల్లడించాడు. స్మారక సభలో ఈ విషయాలను బహిరంగంగా చెప్పాలనుకున్నప్పటికీ, ఆ సమయంలో అది సరైన నిర్ణయం కాదని ఆగిపోయినట్లు తెలిపాడు.
వార్న్ జీవనశైలిపై వివరణ..
వార్న్ ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నప్పటికీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉండేవారని జాక్సన్ గుర్తు చేసుకున్నారు. మరణానికి ముందు ఆయన చాలా సంతోషంగా ఉన్నారని, 80 ఏళ్లు దాటిన వారు కూడా తన తండ్రి కంటే ఎక్కువగా తాగుతూ, పొగ తాగుతూ ఆరోగ్యంగానే ఉన్నారని ఉదాహరణగా చెప్పారు. తన తండ్రి టీకాలు తీసుకోవాలని అస్సలు అనుకోలేదని, కేవలం పని ఒత్తిడి వల్లే ఇతర సామాన్యులలాగే ఆయన కూడా టీకాలు వేయించుకున్నారని ఆరోపించాడు.
వార్న్ మరణానికి కొన్ని నెలల ముందే ఆయన కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ టీకాల అంశంపై ఆలోచిస్తే తనకు కోపం వస్తుందని, కానీ ఆ కోపం ఎవరికీ మంచిది కాదని భావించి మౌనంగా ఉంటున్నట్లు జాక్సన్ వివరించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
