AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: అందుకు భంగం కలిగిస్తాడనే రోహిత్‌ను తప్పించారా.. నివేదికలో షాకింగ్ విషయాలు..!

Rohit Sharma: 75 శాతానికి పైగా విజయాల శాతంతో, ముఖ్యంగా ఐసీసీ టైటిల్ సాధించిన కెప్టెన్‌ను ఇలా తొలగించడంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌కు సరైన గౌరవం దక్కలేదని కొందరు వాదిస్తుంటే, 2027 ప్రపంచకప్‌నకు ముందు సరైన సమయం ఇచ్చి యువ కెప్టెన్‌ను తయారు చేయడం మంచి నిర్ణయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Rohit Sharma: అందుకు భంగం కలిగిస్తాడనే రోహిత్‌ను తప్పించారా.. నివేదికలో షాకింగ్ విషయాలు..!
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Oct 06, 2025 | 12:31 PM

Share

Rohit Sharma: భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ అనూహ్య నిర్ణయం వెనుక గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఒక తాజా నివేదిక ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రోహిత్ శర్మను వన్డే సారథిగా కొనసాగిస్తే, జట్టులో ఉన్న “కల్చర్”కు భంగం కలిగే అవకాశం ఉందని సెలక్షన్ కమిటీ భావించినట్టు ఆ నివేదిక పేర్కొంది.

ఎందుకీ అనూహ్య నిర్ణయం?

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన రోహిత్ శర్మ, ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. అత్యుత్తమ విజయాల శాతం కలిగిన కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే, దీని వెనుక కేవలం సుదీర్ఘకాల ప్రణాళిక మాత్రమే కాకుండా, జట్టు అంతర్గత అంశాలు కూడా ఉన్నాయనేది తాజా నివేదిక సారాంశం.

నివేదిక ప్రకారం, భారత జట్టులో ఒక స్థిరమైన, సామరస్యపూర్వకమైన వాతావరణం (టీమ్ కల్చర్) ఉంది. రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలకడం, వన్డేలను కూడా త్వరలో వదిలేయనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో, కేవలం ఒకే ఫార్మాట్‌కు కెప్టెన్‌గా రోహిత్ కొనసాగడం వల్ల, మునుపటి నుంచీ ఉన్న “జట్టు సంస్కృతి”కి ఇబ్బంది కలగవచ్చని సెలక్టర్లు భావించారట.

యువ కెప్టెన్‌కు అవకాశం.. కారణమిదేనా?

ఒకే కెప్టెన్ అన్ని ఫార్మాట్‌లకు ఉండటం వల్ల జట్టులో యూనిఫార్మిటీ ఉంటుందని, ఇది జట్టు వాతావరణాన్ని పటిష్టం చేస్తుందని సెలక్షన్ కమిటీ బలంగా విశ్వసించిందని సమాచారం. టెస్టులకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించిన తర్వాత, అతనికి వన్డే పగ్గాలు కూడా అప్పగించడం ద్వారా, సుదీర్ఘకాలం పాటు జట్టును నడిపించగలిగే ఒకే నాయకుడిని సిద్ధం చేయాలనేది బీసీసీఐ లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే, 75 శాతానికి పైగా విజయాల శాతంతో, ముఖ్యంగా ఐసీసీ టైటిల్ సాధించిన కెప్టెన్‌ను ఇలా తొలగించడంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌కు సరైన గౌరవం దక్కలేదని కొందరు వాదిస్తుంటే, 2027 ప్రపంచకప్‌నకు ముందు సరైన సమయం ఇచ్చి యువ కెప్టెన్‌ను తయారు చేయడం మంచి నిర్ణయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా, ఒక కెప్టెన్‌ను తప్పించడానికి “టీమ్ కల్చర్” వంటి సున్నితమైన అంశాన్ని కారణంగా చూపడం భారత క్రికెట్‌లో ఒక అరుదైన, షాకింగ్ పరిణామంగానే పరిగణించాలి. ఈ నిర్ణయం భవిష్యత్తులో భారత జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..