Champions Trophy: సెమీ ఫైనల్కి ముందు ఆస్ట్రేలియాకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్! ఏమన్నాడంటే..?
భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. న్యూజిలాండ్పై గెలిచి గ్రూప్ టాప్ చేసిన భారత్, ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ఇప్పుడు టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు. సెమీస్లో ఓడించి, ఆసీస్ను ఇంటికి పంపితే.. వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధ కాస్త అయినా తగ్గుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. కాగా, ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్-బీ టేబుల్ టాపార్గా నిలిచింది. గ్రూప్-బీలో రెండో ప్లేస్లో నిల్చున్న ఆస్ట్రేలియాతో సెమీస్ సమరానికి సిద్ధమైంది భారత్.
ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఐసీసీ టోర్నమెంట్స్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డ్ ఉందనే విషయం మాకు తెలుసు.. కానీ, మాదైన రోజున మేం ఎవరినైనా ఓడిస్తామంటూ రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. న్యూజిలాండ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. “న్యూజిలాండ్ బాగా ఆడుతుంది. వాళ్లపై మంచి స్కోరు సాధించడం ముఖ్యం. ఈ మ్యాచ్లో మేం చేసిన స్కోర్, నాకు మంచి టార్గెట్ అనిపించింది. ఈ మ్యాచ్లో మేం చాలా మంచి క్రికెట్ ఆడాం. 30 పరుగులకే 3 కోల్పోయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడం చాలా ముఖ్యం, మా బ్యాటర్లు అదే చేశారు. దాంతో మేం అనుకున్న స్కోర్ను సాధించగలిగాం. చూసేందుకు స్కోర్ తక్కువగా అనిపించినా, దాన్ని కాపాడుకునే బౌలింగ్ ఎటాక్ మా దగ్గర ఉంది.
ఇక వరుణ్ చక్రవర్తి ఏదో స్పెషాలిటీ ఉంది. నెట్స్లో కూడా మాకు ఆ వేరియేషన్స్ చూపించడు. ఇక రానున్న మ్యాచ్ గురించి తాము పెద్దగా ఆలోచించడం లేదని అన్నాడు. మంచి టఫ్ ఫైట్ ఉంటే ఎప్పూడు బాగుటుంది. చిన్న టోర్నీల్లో ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఇక ఆస్ట్రేలియాకు ICC టోర్నమెంట్లను బాగా ఆడే గొప్ప చరిత్ర ఉంది, కానీ మాదైన రోజున మమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మంచి ఫైట్ అవుతుంది. మేం కూడా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం” అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని రోహిత్ ఇప్పటికీ మనసులో పెట్టుకున్నాడనే విషయం అతని మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక విధంగా ఆసీస్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి కచ్చితంగా ఆసీస్పై గెలుస్తామంటూ, ఈ మంగళవారం మాదే అంటూ నొక్కిచెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
