Petrol: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఆ ఎఫెక్ట్తో సామాన్యుడి జేబుకి చిల్లు..!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమనే అవకాశాలు ఉన్నాయి. బ్యారెల్ ధర 110 డాలర్లకు చేరుతుందా..? మన జేబుపై దీని ప్రభావం ఎలా ఉండనుంది? నిపుణులు ఏమంటున్నారు..? అనేది తెలుసుకుందాం..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్పై బాంబుల దాడికి తెగబడటంతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ ఫత్-ఎ-ఖైబర్ పేరుతో ప్రతీకార చర్యలకు దిగింది. ఈ సైనిక చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ వివాదం నేరుగా చమురు ధరలపై భారీ ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 10శాతం పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్యారెల్ ధర 110 డాలర్లకి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధర బ్యారెల్కు 72.87 డాలర్లుగా ఉంది.
హార్ముజ్ జలసంధి – ప్రపంచ దేశాల గుండెల్లో భయం
అసలు ఆందోళన ఉత్పత్తి కంటే చమురు రవాణా మార్గం గురించే. ప్రపంచ చమురు వ్యాపారంలో 20శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది.ఈ కీలకమైన సముద్ర మార్గం ఇరాన్కు అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ ఇరాన్ చిన్న పడవలు, హై-స్పీడ్ అటాక్ క్రాఫ్ట్లు, సముద్ర మైన్లను మోహరించింది. ఈ మార్గంలో చిన్న అంతరాయం కలిగినా చమురు ధరలకు 20 డాలర్ల నుంచి 40 డాలర్ల వరకు అదనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు మౌలిక్ పటేల్, ఖుష్బూ బలాని విశ్లేషించారు.
సామాన్యుడిపై భారం ఖాయం..
ఈ యుద్ధం కేవలం దేశాల మధ్య మాత్రమే కాదు సామాన్యుడి వంటగదిపై కూడా ప్రభావం చూపనుంది. ముడి చమురు ధరలు పెరిగితే వాహన ఇంధన ఖర్చులు ఆకాశాన్ని తాకనున్నాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. రాబో బ్యాంక్ ఇంటర్నేషనల్, ఈక్విరస్ సెక్యూరిటీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ పూర్తిగా భయంతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు 95 నుండి 110 డాలర్ల స్థాయిని సులభంగా దాటుతాయని అంచనా వేశారు.
