రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్కు నిరాశే.. టీమిండియా జెర్సీలో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో తెలుసా?
India vs West Indies ODI 2026: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఉనికి వన్డే క్రికెట్కు కొత్త ప్రాణం పోస్తోందనడంలో సందేహం లేదు. రాబోయే సిరీస్లలో ఈ దిగ్గజాలు మళ్లీ పరుగుల వరద పారించాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Rohit Sharma-Virat Kohli Next Match: ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా అభిమానులకు కాస్త నిరాశే మిగిలింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ, ఆఖరి మ్యాచ్లో రోహిత్ శర్మ తుఫాన్ సెంచరీ, విరాట్ కోహ్లీ అర్ధసెంచరీతో మెరిసి అభిమానులకు విందు పంచారు. అయితే టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పిన ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ భారత జెర్సీలో ఎప్పుడు కనిపిస్తారనే ప్రశ్న ప్రతి అభిమాని గుండెల్లో తొంగిచూస్తోంది.
రోహిత్-కోహ్లీ మ్యాచ్ కోసం సుదీర్ఘ నిరీక్షణ..
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఇద్దరూ ఇప్పటికే టెస్టులకు, టీ20 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పడంతో.. వీరిద్దరిని మైదానంలో చూడటానికి అభిమానులకు ఉన్న ఏకైక మార్గం వన్డే ఫార్మాట్ మాత్రమే. అయితే ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత భారత అభిమానులు దాదాపు రెండు నెలల పాటు వీరికి దూరంగా ఉండక తప్పదు.
రోహిత్ శర్మ ఇంగ్లాండ్ సిరీస్ చివరి వన్డేలో 110 బంతుల్లో 138 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించగా, విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. జట్టుకు ఓటమి ఎదురైనప్పటికీ, వీరిద్దరి ఫామ్ రాబోయే మ్యాచ్లపై భారీ అంచనాలను పెంచేసింది.
సెప్టెంబర్లో వెస్టిండీస్తో పోరు..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించేది వచ్చే సెప్టెంబర్ నెలలోనే. సొంతగడ్డపై వెస్టిండీస్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ద్వారా వీరిద్దరూ మైదానంలోకి దిగనున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 3న ముగియనుంది.
భారత్ – వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్:
మొదటి వన్డే: సెప్టెంబర్ 27 (తిరువనంతపురం)
రెండో వన్డే: సెప్టెంబర్ 30 (గువాహటి)
మూడో వన్డే: అక్టోబర్ 3 (న్యూ ఛండీగఢ్)
2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాలు..
వెస్టిండీస్తో హోమ్ సిరీస్ ముగిసిన వెంటనే, టీమిండియా నవంబర్ నెలలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ కివీస్తో 5 వన్డేల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని రోహిత్, కోహ్లీకి ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. అనంతరం డిసెంబర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటించి 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




