AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh : గ్రౌండ్‌లో సిక్సర్లు.. ఆఫీసులో సంతకాలు.. అధికారిగా మారిన క్రికెట్ సంచలనం

Rinku Singh : భారత క్రికెటర్ రింకూ సింగ్‌కు యూపీ ప్రభుత్వం రూ. 3 కోట్ల నగదు, రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉద్యోగం ప్రకటించింది. నెలకు సుమారు రూ.70,000 నుంచి 80,000 వరకు జీతం అందనుంది. సీఎం యోగికి ధన్యవాదాలు తెలుపుతూ రింకూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Rinku Singh  : గ్రౌండ్‌లో సిక్సర్లు.. ఆఫీసులో సంతకాలు.. అధికారిగా మారిన క్రికెట్ సంచలనం
Rinku Singh
Rakesh
|

Updated on: Mar 26, 2026 | 8:13 AM

Share

Rinku Singh : భారత క్రికెట్ సంచలనం, సిక్సర్ల కింగ్ రింకూ సింగ్‎కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనను అద్భుతమైన బహుమతులతో ముంచెత్తారు. రింకూకు ఏకంగా రూ.3 కోట్ల నగదు పురస్కారంతో పాటు గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కట్టబెట్టారు. ఈ వార్త ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (RSO)గా నియమించింది. లక్నోలోని లోక్ భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా నియామక పత్రాలను అందజేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రింకూ నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యోగంలో రింకూకు 7వ వేతన సంఘం ప్రకారం నెలకు సుమారు రూ.70,000 నుంచి 80,000 వరకు జీతం అందనుంది. ఒక క్రికెటర్‌కు ఈ స్థాయి హోదా కల్పించడం ద్వారా క్రీడాకారులకు యూపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పారు.

వరల్డ్ కప్ నుంచి కేకేఆర్ వైస్ కెప్టెన్ వరకు

రింకూ సింగ్ ఎదుగుదల ఒక సినిమా కథను తలపిస్తుంది. 2023 ఐపీఎల్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన రింకూ, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇటీవల జరిగిన 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించారు. దీనికి గుర్తింపుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ ఆయనను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకోవడమే కాకుండా, జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించింది. అటు ఐపీఎల్ వేలం ద్వారా కోట్లు, ఇటు ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు అందడంతో రింకూ సింగ్ ఇప్పుడు సంపన్న క్రికెటర్ల జాబితాలో చేరిపోయారు.

కష్టాల్లోనూ మొక్కవోని ధైర్యం

టీ20 ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనే రింకూ తన తండ్రిని కోల్పోయారు. ఆ బాధలోనూ ఇంటికి వెళ్లి అంత్యక్రియలు ముగించుకుని, వెనువెంటనే తిరిగి వచ్చి టీమ్ ఇండియా కోసం తన విధిని నిర్వర్తించారు. ఈ అంకితభావమే ఆయనను అందరికీ ఇష్టుడిగా మార్చింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, కఠిన శ్రమతో నేడు ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. త్వరలో జరగనున్న ఐపీఎల్‌లో రింకూ తన దూకుడును కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు.

యోగి సర్కార్ ప్రోత్సాహం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడంలో ముందుంటోంది. రింకూ సింగ్ కంటే ముందు దీప్తి శర్మ వంటి క్రీడాకారిణులకు కూడా ఇదే తరహాలో నగదు బహుమతులు, ఉద్యోగాలు ఇచ్చారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ చర్యలు కలిగిస్తున్నాయి. రింకూకు ఇచ్చిన ఈ గౌరవం వల్ల యూపీ నుంచి మరిన్ని క్రీడా ఆణిముత్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us