- Telugu News Sports News Cricket news Rahul Dravid tenure helped India win Champions Trophy Says Rohit Sharma
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడంలో గంభీర్ పాత్ర జీరో..: రోహిత్ షాకింగ్ కామెంట్స్..
Rohit Sharma Key Comments on Rahul Dravid: 2025 ప్రారంభంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా ఇది తొలి ఐసీసీ టోర్నమెంట్ కూడా. ఈ విజయంపై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు.
Updated on: Oct 08, 2025 | 7:52 AM

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలవడానికి మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన పదవీకాలంలో రూపొందించిన ప్రణాళికలు, ప్రక్రియలే (Processes) కీలకమని అభిప్రాయపడ్డాడు. జట్టు విజయం కేవలం ఒక్కట్రెండు రోజుల్లోనో లేదా ఒకట్రెండు సంవత్సరాల్లోనో జరగలేదని, కొన్నేళ్లుగా చేసిన కృషి దీనికి ప్రధాన కారణమని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు. ఒక క్రీడా పురస్కార వేడుకలో పాల్గొన్న రోహిత్ శర్మ, భారత జట్టు వరుసగా 2024 టీ20 ప్రపంచకప్ (T20 World Cup, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలవడంపై మాట్లాడాడు.

దశాబ్దాల ప్రయాణం: "నాకీ జట్టు అంటే చాలా ఇష్టం. వీరితో కలిసి ఆడడాన్ని నేను ఆస్వాదిస్తా. మా ప్రయాణం చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. ఇది ఒకటి లేదా రెండేళ్లలో జరిగింది కాదు. ఈ ప్రణాళిక ఎప్పుడో మొదలైంది. ఐసీసీ ట్రోఫీ విజయానికి మేం చాలాసార్లు చేరువగా వెళ్లాం, కానీ గెలవలేకపోయాం."

విభిన్నంగా ఆలోచించాం: "అందుకే, మేం ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. అది కేవలం ఒక్కరు లేదా ఇద్దరు ఆటగాళ్ల వల్ల సాధ్యమయ్యేది కాదు. జట్టులో ప్రతి ఒక్కరూ ఆ ఆలోచనను నమ్మాలి, ఆ దిశగా కృషి చేయాలి. మా జట్టులోని ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించారు, ఇది చాలా మంచి విషయం."

ద్రవిడ్తో ప్రణాళికలు: "ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న ఆటగాళ్లందరూ, ఆటలను ఎలా గెలవాలి, మనల్ని మనం ఎలా సవాలు చేసుకోవాలి, ఆత్మసంతృప్తికి లోనుకాకుండా ఎలా ఉండాలి అనే ఆలోచనా విధానంలోకి వచ్చారు. ఈ లక్షణాలనే మేం జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నించాం. మేం 2024 టీ20 ప్రపంచకప్ కోసం నేను, ద్రవిడ్ (రాహుల్ భాయ్) ప్రణాళికలు రచిస్తున్నప్పుడు కూడా ఈ విషయాలనే అనుసరించాం. అదే పద్ధతిని ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాం."

ఒక్కో మ్యాచ్పై దృష్టి: "ఒక మ్యాచ్ గెలిచిన వెంటనే, మేం దానిని పూర్తిగా పక్కన పెట్టి, తదుపరి మ్యాచ్పై దృష్టి సారించాం. ఈ క్రమశిక్షణ, దృష్టి మాకు రెండు టోర్నమెంట్లు గెలవడానికి సహాయపడింది."

2023 ప్రపంచకప్ అనుభవం: "2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మేం గెలవకపోయినా, ఒక జట్టుగా ఏదైనా సాధించాలని మేం బయలుదేరాం, ప్రతి ఒక్కరూ దానిని అమలు చేశారు. ఆ అనుభవం కూడా మాకు తర్వాత ఐసీసీ ఈవెంట్లలో బాగా ఉపయోగపడింది."

నిజానికి, 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్నారు. అయినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం తమ వరుస ఐసీసీ విజయాల వెనుక ద్రవిడ్ కోచ్గా ఉన్నప్పుడు వేసిన పటిష్టమైన పునాది, దీర్ఘకాలిక ప్రణాళిక (Long-term Planning), జట్టు సభ్యుల్లో పాతుకుపోయిన కొత్త "విజయ సాధన ప్రక్రియ"ను (Winning Process) ప్రస్తావించడం విశేషం.




