AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే..

ఎంత మంచి ఆహారం తిన్నా కూడా.. భోజనం ముగించిన వెంటనే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ ఆహారం నుండి అందాల్సిన పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తిన్న ఆహారం ఒంటబట్టాలన్నా, గ్యాస్, అజీర్తి సమస్యలు రాకుండా ఉండాలన్నా భోజనం తర్వాత అస్సలు చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే..
Bad Habits After Eating
Krishna S
|

Updated on: Jun 18, 2026 | 10:02 PM

Share

మనం ప్రతిరోజూ తినే ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే కేవలం మంచి ఆహారం తినడమే కాదు.. తిన్న తర్వాత మనం పాటించే అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని శాసిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలియకుండానే భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. దీనివల్ల ఆహారం ద్వారా అందాల్సిన పూర్తి పోషకాలు శరీరానికి అందకపోగా, జీర్ణవ్యవస్థ సాధారణ పనితీరు కూడా దెబ్బతింటుంది. మరి భోజనం తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి ఏయే అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తిన్న వెంటనే పడుకుంటున్నారా?

చాలా మందికి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేయగానే హాయిగా బెడ్ ఎక్కి పడుకోవాలనిపిస్తుంది. కానీ తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా మందగిస్తుంది. ఇది కడుపులో యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, తీవ్రమైన అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే భోజనం తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా ఇంట్లోనే నెమ్మదిగా నడవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

గటగటా నీళ్లు తాగేస్తున్నారా?

భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగడం అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఆహారాన్ని అరిగించడానికి కడుపులో ఊరే జీర్ణ రసాలు పలచబడిపోతాయి. కడుపులోని గ్రంధుల పనితీరు ప్రభావితమై అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజన సమయంలో నీటిని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు కానీ గొంతు తడుపుకోవడానికి మితంగా తాగాలి. భోజనం ముగించిన కొద్దిసేపటి తర్వాత నీరు తాగడం జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

వెంటనే వ్యాయామం లేదా జిమ్‌కు వెళ్తున్నారా?

కొంతమంది తిన్న ఆహారం అరిగిపోవాలని లేదా బరువు పెరగకూడదని భోజనం చేసిన వెంటనే జిమ్‌కు వెళ్లడం లేదా కఠినమైన వ్యాయామాలు చేయడం చేస్తుంటారు. కానీ భోజనం తర్వాత మన శరీరం ఆహారాన్ని అరిగించడం కోసం చాలా శక్తిని ఉపయోగించుకుంటుంది. రక్తప్రసరణ అంతా పొట్ట వైపు మళ్లుతుంది. అలాంటి సమయంలో తీవ్రంగా వ్యాయామం చేస్తే కడుపునొప్పి, వికారం, వాంతులు లేదా ఇతర జీర్ణ సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి.

భోజనం తర్వాత వేడి వేడిగా టీ, కాఫీలా?

భోజనం ముగించగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి ఒక వ్యసనంలా మారిపోయింది. అయితే ఈ పానీయాలలో ఉండే కొన్ని సమ్మేళనాలు మనం తిన్న ఆహారం నుండి ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇది దీర్ఘకాలంలో రక్తహీనత, పోషకాహార లోపాలకు దారితీస్తుంది. అందుకే టీ లేదా కాఫీ తాగాలనుకుంటే భోజనం చేసిన కనీసం ఒక గంట తర్వాత తాగడం మంచిది.

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం సులభమైన సూత్రం

ఆహారం నాణ్యత ఎంత ముఖ్యమో, భోజనం తర్వాత మన ప్రవర్తన కూడా అంతకంటే ముఖ్యం. తిన్న వెంటనే పడుకోవడం, ఎక్కువగా నీరు త్రాగడం, కఠినమైన వ్యాయామం చేయడం లేదా టీ,కాఫీలు తాగడం వంటి అలవాట్లను నియంత్రించుకుంటే మీ జీర్ణవ్యవస్థ ఎల్లప్పుడూ చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో చేసుకునే ఇలాంటి చిన్న చిన్న మార్పులే భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా బలమైన పునాది వేస్తాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని టీవీ9 నిర్ధారించడం లేదు. ఆహార మార్పులు చేసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us