PSL vs IPL : ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్గా పీఎస్ఎల్.. ఈ నఖ్వీకి ఏదో పిచ్చిపట్టినట్లుంది
PSL vs IPL : పీఎస్ఎల్ ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అవుతుందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ధీమా వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీల వేలంలో రికార్డు స్థాయి బిడ్లు దాఖలు కావడం లీగ్ ఎదుగుదలకు నిదర్శనమన్నారు. అయితే స్టార్ ప్లేయర్లు లీగ్ వీడటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గట్టి దెబ్బ తగిలింది.

PSL vs IPL : పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) బాస్ మొహ్సిన్ నఖ్వీ కలలు ఒకలా ఉంటే, గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉంది. ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ కావాలని పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆరాటపడుతుంటే, ఊహించని పరిణామాలు ఆ లీగ్ను దెబ్బతీస్తున్నాయి. ఐపీఎల్తో పోటీ పడతామని ప్రగల్భాలు పలుకుతున్న తరుణంలోనే పీఎస్ఎల్ నిర్వహణలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాజాగా యూఏఈ బోర్డు తీసుకున్న నిర్ణయం పీసీబీకి గట్టి షాక్ ఇచ్చింది. గడ్డాఫీ స్టేడియంలో జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం తర్వాత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు పీఎస్ఎల్ ఒక గొప్ప వేదికగా మారిందని, అతి త్వరలోనే ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్గా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పీఎస్ఎల్ క్రేజ్ దాన్ని మించిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీల వేలంలో రికార్డు స్థాయి బిడ్లు దాఖలు కావడం లీగ్ ఎదుగుదలకు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు.
నఖ్వీ నోట నంబర్ వన్ మాట
నఖ్వీ ఇలా ప్రకటనలు చేస్తున్నారో లేదో, అప్పుడే పీఎస్ఎల్ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు ఖుజైమా బిన్ తన్వీర్, ముహమ్మద్ వసీం ఉన్నట్టుండి జట్టును వదిలేసి యూఏఈ వెళ్లిపోయారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB) వారిని వెంటనే స్వదేశానికి రావాలని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న డొమెస్టిక్ 50 ఓవర్ల టోర్నమెంట్ (D50)లో ఆడాలని వారిని పిలిపించుకోవడంతో పీసీబీ ఖంగుతింది. లీగ్ మధ్యలో ఇలా ప్లేయర్లు వెళ్ళిపోవడం పీఎస్ఎల్ ప్రతిష్టను మసకబారుస్తోంది. వీరు కొన్ని మ్యాచ్ల తర్వాత తిరిగి వస్తారని వార్తలు వస్తున్నా, ప్రస్తుతానికి ఇది పీసీబీకి అవమానకరమే.
ఐపీఎల్ సెగ.. పీఎస్ఎల్ కు తప్పని కష్టాలు
ఈ ఏడాది పీఎస్ఎల్ ఏకంగా ఐపీఎల్తో నేరుగా తలపడాల్సి రావడం పెద్ద మైనస్ పాయింట్గా మారింది. సాధారణంగా ఐపీఎల్ జరిగే సమయంలో స్టార్ ప్లేయర్లు ఎవరూ పీఎస్ఎల్ వైపు చూడరు. చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే పీఎస్ఎల్ కాంట్రాక్టులను వదులుకుని ఐపీఎల్కు క్యూ కట్టారు. దీంతో లీగ్లో నాణ్యమైన క్రికెట్ తగ్గిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం విదేశీ ఆటగాళ్ల కొరత మాత్రమే కాదు, పాకిస్థాన్లో పెరుగుతున్న పెట్రోలియం సంక్షోభం, అఫ్గానిస్థాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా లీగ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
అంతర్గత సమస్యలతో సతమతం
లీగ్ ఆదాయం పెరుగుతోందని మొహ్సిన్ నఖ్వీ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కునారిల్లడం వల్ల స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే తగ్గింది. మరోవైపు ఐపీఎల్ గ్లోబల్ బ్రాండ్గా దూసుకుపోతుంటే, పీఎస్ఎల్ కనీసం తన ప్లేయర్లను నిలబెట్టుకోలేక పోవడం విడ్డూరంగా ఉంది. అగ్రస్థానానికి వెళ్తామని కలలు కనడం మంచిదే కానీ, అందుకు తగ్గ ప్రణాళికలు లేకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు నవ్వులపాలవుతోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
