Mithali Raj: మన్ కీ బాత్లో మిథాలీ రాజ్ ప్రస్తావన.. మన లేడీ సచిన్ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే..
PM Modi Mann Ki Baat: మహిలా క్రికెట్ దిగ్గజం, అభిమానులు లేడీ సచిన్ అని ముద్దుగా పిల్చుకునే మిథాలీ రాజ్ (Mithali Raj) ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 23 ఏళ్లపాటు టీమిండియాకు..
PM Modi Mann Ki Baat: మహిలా క్రికెట్ దిగ్గజం, అభిమానులు లేడీ సచిన్ అని ముద్దుగా పిల్చుకునే మిథాలీ రాజ్ (Mithali Raj) ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 23 ఏళ్లపాటు టీమిండియాకు సేవలందించిన ఆమె మహిళల క్రికెట్ రూపు రేఖలను మార్చారు. అదే సమయంలో వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు, మైలురాళ్లు అందుకున్నారు. కాగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించగానే పలువురు ప్రముఖులు మిథాలీ మహిళల క్రికెట్కు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ( PM Narendra Modi) కూడా లేడీ సచిన్ను అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె గురించి మోడీ ప్రస్తావించారు. మిథాలీ రిటైర్మెంట్ తర్వాతి జీవితం బాగుండాలంటూ ఆకాంక్షించారు.
యువ అథ్లెట్లకు ఆమె ఆదర్శం..
‘క్రీడల విషయానికి వస్తే నేనొకటి చెప్పదల్చుకున్నాను. భారతదేశం తరఫున అత్యంత ట్యాలెంటెడ్ క్రికెటర్లలో మిథాలీ రాజ్ ఒకరు. ఆమె గురించి నేను ఇవాళ ప్రస్తావించాలనుకుంటున్నా. టీమిండియాకు 23 ఏళ్ల పాటు సేవలందించిన ఆమె ఈ నెల ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికింది. ఇది చాలా మంది అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు.. ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. మిథాలీ తదుపరి భవిష్యత్తుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని చెప్పుకొచ్చారు మోడీ. కాగా 39 ఏళ్ల మిథాలీ 232 వన్డేల్లో 7,805 పరుగులు చేసింది. 89 టీ20 మ్యాచ్లు కూడా ఆడింది. 12 టెస్టులు ఆడి ఓ డబుల్ సెంచరీ ఖాతాలో వేసుకుంది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ మిథాలీనే కావడం విశేషం. కాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో మిథాలీతో పాటు బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధును కూడా ప్రత్యేకంగా అభినందించారు మోడీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..