IPL Twice a Year: ఇకపై ఏడాదికి 2సార్లు ఐపీఎల్.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఎప్పుడెప్పుడంటే?
BCCI big Announcement on IPL: ఏడాదికి రెండు ఐపీఎల్ టోర్నీలనే ప్రతిపాదన నిజమైతే క్రికెట్ ప్రేమికులకు అంతకంటే కావలసింది ఏముంటుంది! ప్రస్తుత సీజన్ లో ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే, భవిష్యత్తులో ఐపీఎల్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయనే ఆసక్తి మరోవైపు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

BCCI big Announcement on IPL: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్‘ (ఐపీఎల్) అభిమానులకు బీసీసీఐ త్వరలోనే ఒక భారీ తీపి కబురు అందించబోతోంది. ఇకపై ఏడాదికి ఒకసారి కాకుండా, రెండు విభిన్న సమయాల్లో ఐపీఎల్ నిర్వహించేలా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
పండుగ సీజన్ పై కన్నేసిన బోర్డు.. ఇక డబుల్ వినోదం!
ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా లీగ్ విస్తరణపై సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం మార్చి నుంచి మే వరకు రెండు నెలల పాటు సాగే ఈ టోర్నీని మరింత పెద్దదిగా మార్చాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతమున్న 74 మ్యాచ్ల సంఖ్యను భవిష్యత్తులో 94 మ్యాచ్లకు పెంచాలనేది బీసీసీఐ అసలు ప్రణాళిక. అయితే, జూన్ నెలలో భారతదేశంలో ఉండే తీవ్రమైన ఎండలు, ఉక్కపోత వల్ల ఆటగాళ్లకు, మైదానానికి వచ్చే అభిమానులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ నేపథ్యంలోనే ఏడాదిని రెండు భాగాలుగా విభజించి ఐపీఎల్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీని ప్రకారం, మొదటి విడతను ఫిబ్రవరి నుంచే ప్రారంభించి ఏప్రిల్ లోపు ముగించడం, ఆ తర్వాత రెండో విడతను సెప్టెంబర్ – అక్టోబర్ నెలల మధ్య నిర్వహించడంపై కసరత్తులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో భారత్లో వ్యాపార ప్రకటనల సందడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయాన్ని అందిపుచ్చుకోవాలని బోర్డు భావిస్తోంది. అయితే, ప్రసారదారులతో (బ్రాడ్కాస్టర్స్) చర్చించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ పై దీని ప్రభావం ఎంత?
ఈ ప్రతిపాదన కేవలం భారత క్రికెట్ బోర్డుకు మాత్రమే పరిమితం కాదు. ఐపీఎల్ జరిగే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ఇక్కడే ఉంటారు కాబట్టి, ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో కూడా చర్చలు జరపాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్కు ఇబ్బంది కలగకుండా ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.
తుది సమరానికి బెంగళూరు.. నేడే చావో రేవో ఎలిమినేటర్..!
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్ విషయానికి వస్తే, టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. క్వాలిఫైయర్-1 పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఘనవిజయం సాధించి నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ తుది సమరం జరగనుంది.
మరోవైపు, నేడు ముల్లాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన ‘ఎలిమినేటర్’ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరడం కోసం క్వాలిఫైయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడాల్సి ఉంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




