IPL 2026 : 250+ పరుగులతో ఆర్సీబీ హిస్టారికల్ రికార్డ్.. వెస్టిండీస్నే వెనక్కి నెట్టేసిన కోహ్లీ సేన
IPL 2026 : టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆర్సీబీ ఒక అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓవరాల్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్ల జాబితాలో వెస్టిండీస్, జింబాబ్వే లాంటి అంతర్జాతీయ జట్లనే ఆర్సీబీ దాటేసింది.

IPL 2026 : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సృష్టించిన పరుగుల సునామీ అంతా ఇంతా కాదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా.. ఆ తర్వాత గుజరాత్ను 162 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ఫైనల్స్ టికెట్ ఖరారు చేసుకోవడంతో పాటు, టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆర్సీబీ ఒక అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓవరాల్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్ల జాబితాలో వెస్టిండీస్, జింబాబ్వే లాంటి అంతర్జాతీయ జట్లనే ఆర్సీబీ దాటేసింది.
ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ (అంతర్జాతీయ టీ20లతో పాటు డొమెస్టిక్ లీగ్లు) చరిత్రలో అత్యధిక సార్లు 250+ స్కోర్లు సాధించిన రికార్డు ప్రస్తుతం మన భారత జాతీయ క్రికెట్ జట్టు పేరిట ఉంది. టీమిండియా ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో రికార్డు స్థాయిలో 7 సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ లిస్ట్లో రెండో స్థానంలో నిలిచింది ఏ దేశమో కాదు.. ఐపీఎల్లో పరుగుల విధ్వంసానికి మారుపేరైన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH). కావ్యమారన్ ఆరెంజ్ ఆర్మీ ఇప్పటివరకు టీ20ల్లో 6 సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసి రెండో స్థానంలో రికార్డు సృష్టించింది.
గుజరాత్పై చేసిన 254 పరుగుల విధ్వంసంతో ఆర్సీబీ జట్టు తన టీ20 చరిత్రలో 4వ సార్లు 250+ మార్కును దాటి మూడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ డొమెస్టిక్ జట్టు సర్రే, అంతర్జాతీయ జట్లయిన వెస్టిండీస్, జింబాబ్వేలతో పాటు ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ (PBKS) రికార్డులను బెంగళూరు బద్దలు కొట్టింది. ఈ జట్లన్నీ తమ చరిత్రలో కేవలం 3 సార్లు మాత్రమే 250+ స్కోర్లు సాధించాయి. కానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పిల్లర్ గా ఉన్న ఆర్సీబీ.. ఈ ఐపీఎల్ 2026 సీజన్ లోనే ఏకంగా రెండు సార్లు 250 ప్లస్ స్కోర్లు బాదడం విశేషం. ఈ సీజన్ లోనే అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై కూడా ఆర్సీబీ 250 పరుగులు సాధించింది.
ఐపీఎల్ చరిత్రను గమనిస్తే.. ఇప్పటివరకు ప్లేఆఫ్స్ లేదా నాకౌట్ మ్యాచ్లలో ఏ ఒక్క జట్టు కూడా 250 పరుగుల మార్కును అందుకోలేదు. అంతకుముందు 2023 ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గుజరాత్ టైటాన్స్ జట్టు చేసిన 233 పరుగులే ఇప్పటివరకు ప్లేఆఫ్స్లో అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే ఇప్పుడు ఆర్సీబీ ఏకంగా 254 పరుగులు సాధించి.. గుజరాత్ పాత రికార్డును అదే గుజరాత్ జట్టుపై బద్దలు కొట్టడం ఒక మధురమైన కాకతాళీయం. రజత్ పటీదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీని ఐపీఎల్ చరిత్రలోనే ఒక అజేయమైన శక్తిగా నిలబెట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
