మొనగాడు వచ్చేశాడ్రోయ్.! ఐపీఎల్లో కోహ్లీకి ఇచ్చేపడేశాడుగా.. దెబ్బకు రికార్డు బ్రేక్..
గుజరాత్ టైటాన్స్ సారధి శుభ్మన్ గిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు. కేవలం 24 ఏళ్ల 215 రోజుల్లో గిల్ ఈ ఘనత సాధించాడు. తద్వారా రన్మెషిన్, RCB స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును..

గుజరాత్ టైటాన్స్ సారధి శుభ్మన్ గిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు. కేవలం 24 ఏళ్ల 215 రోజుల్లో గిల్ ఈ ఘనత సాధించాడు. తద్వారా రన్మెషిన్, RCB స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును ఈ యువ క్రికెటర్ బద్దలు కొట్టాడు. విరాట్ మూడువేల పరుగుల మార్క్ను 26 ఏళ్ల 186 రోజుల్లో సాధించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో శుభమన్ గిల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా గిల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని సాధించగా.. గిల్ 94 ఇన్నింగ్స్లు ఆడాడు.
ఇటీవల భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన, నిలకడయిన ఆటతో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఇదే అతడిని ప్రముఖ క్రికెటర్ల సరసన చేరేలా చేసింది. తక్కువ ఇన్నింగ్స్లో 3,000 పరుగుల మైలురాయిని చేరుకోవడంలో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్ వంటి వారి సరసన నిలిపింది. గిల్ ఐపీఎల్లో రాణించడమే కాకుండా, దేశం తరఫున ఆడే సిరీస్లలో సైతం అద్భుతమైన ఆటతో తాజాగా టీ20ల్లో 4వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తరఫున అరంగేట్రం చేసిన అతను ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకు గుజరాత్ తరఫున గిల్ 1,500 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టు విజయానికి కీలకమైన ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో దూసుకెళ్తున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కు వెళ్లడంతో ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరించాడు.
