IND Vs SA: టాస్ అప్పుడే టీమిండియా ఓటమి తేలిపోయింది.. ఓడినా ఇంకా సిగ్గు రాలేదేమో.!
రెండో టీ20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా 51 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది. ఇది భారత్కు రెండో అతిపెద్ద పరాజయం. సౌత్ ఆఫ్రికా 213/4 పరుగులు చేయగా, భారత్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ముల్లాన్పూర్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవి చూసింది. సఫారీల చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది టీమిండియాకు టీ20 ఫార్మాట్లో రెండో అతిపెద్ద పరాజయం. గతంలో న్యూజిలాండ్తో 80 పరుగుల తేడాతో ఓడిన విషయం విదితమే. ఈ మ్యాచ్ ఓటమితో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మొదట టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక అప్పుడే జట్టు ఓటమి ఖరారైంది. సఫారీల ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 90 పరుగులు(5 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి, భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. మార్క్రమ్, డికాక్ కలిసి 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. ఆ తర్వాత వచ్చిన హెండ్రిక్స్, బ్రెవిస్ పెద్దగా రాణించలేకపోయారు. అయితే, చివర్లో ఫెరేరా, డేవిడ్ మిల్లర్ కేవలం 23 బంతుల్లో 53 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి సౌత్ ఆఫ్రికా స్కోరును 213/4కి చేర్చారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు) మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్, శివం దూబే కొంతవరకు పర్వాలేదనిపించినా, ప్రధాన పేసర్లు ఘోరంగా విఫలమయ్యారు. అర్ష్దీప్ సింగ్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకోగా, ఒకే ఓవర్లో ఏడు వైడ్లు వేసి చెత్త రికార్డు నమోదు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన భారత్కు.. ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ మరోసారి విఫలమయ్యారు. ఇక తిలక్ వర్మ ఒక్కడే ఐదో స్థానంలో 34 బంతుల్లో 62 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్(21 బంతుల్లో 21 పరుగులు), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 20 పరుగులు) తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడి రిక్వైర్డ్ రన్ రేట్ను పెంచేశాడు. ఇక లోయర్ ఆర్డర్ పూర్తిగా సర్దుకోవడంతో భారత జట్టు కేవలం 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు), లుంగి ఎన్గిడి(2 వికెట్లు), బాట్మన్(4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) భారత బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పేసర్లు.. అన్ని వికెట్లు పడగొట్టడం T20 క్రికెట్ చరిత్రలోనే వారికి ఇది తొలిసారి. భారత జట్టు కూడా ఒక T20 ఇన్నింగ్స్లో పది వికెట్లను పేసర్లకు కోల్పోవడం ఇదే తొలిసారి. అక్షర్ పటేల్ను మూడో స్థానంలో పంపడం.. శివమ్ దూబే ఎనిమిదో స్థానంలో.. అలాగే గిల్ డకౌట్.. సంజూ బెంచ్కే పరిమితం చేయడం లాంటి గంభీర్ నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిపోయిందని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి








