IND vs ENG: ఇంగ్లాండ్తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?
IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటన నిరాశపరిచినప్పటికీ, ఇంగ్లాండ్తో పోరుకు భారత యువ రక్తం ఉరకలేస్తోంది. రికార్డుల పరంగా భారత్కు లీడ్ ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ను వారి స్వదేశంలో ఢీకొట్టడం అంత సులువు కాదు. ఈ హై-వోల్టేజ్ సిరీస్లో గెలిచి భారత్ మళ్లీ ఫామ్లోకి వస్తుందో లేదో చూడాలి.

IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవాన్ని మరువకముందే భారత యువ జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఐర్లాండ్ చేతిలో పరాభవం.. ఇంగ్లాండ్పై ప్రతీకారానికి సై..!
భారత క్రికెట్ జట్టుకు ఇటీవల ఐర్లాండ్ పర్యటన పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆయిర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్కు గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ అవమానకర ఓటమి నుంచి కోలుకుని, తిరిగి ఫామ్లోకి రావాలని టీమిండియా పట్టుదలగా ఉంది. జులై 1 నుంచి 19 వరకు జరగనున్న ఈ ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ మొత్తం ఎనిమిది పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడనుంది. ఇందులో భాగంగా మొదట ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఐర్లాండ్ చేతిలో తిన్న దెబ్బకు ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది.
హోరాహోరీగా సాగనున్న టీ20 సిరీస్ షెడ్యూల్..
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్ సిద్ధమైంది.
మొదటి టీ20: జులై 1న చెస్టర్-లీ-స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో ప్రారంభమవుతుంది.
రెండూ టీ20: జులై 4న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతుంది.
మూడో టీ20: జులై 7న నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో నిర్వహిస్తారు.
నాలుగో టీ20: జులై 9న బ్రిస్టల్లోని సీట్ యునిక్ స్టేడియంలో జరుగుతుంది.
ఐదో టీ20: జులై 11న సౌతాంప్టన్లోని యుటిలిటా బౌల్ వేదికగా ముగుస్తుంది.
ఇంగ్లాండ్లోని చిన్న బౌండరీలు, వేగవంతమైన పిచ్ల కారణంగా ఈ మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లలోని దూకుడు గల బ్యాటర్ల మధ్య ఈ పోరు అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయం.
హెడ్-టు-హెడ్ రికార్డులు: భారత్దే పైచేయి..!
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 చరిత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2007 నాటి మొట్టమొదటి టీ20 ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది, కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన చారిత్రాత్మక మ్యాచ్ ఇరు జట్ల మధ్యే జరిగింది.
ఇప్పటివరకు ఇరు జట్లు అంతర్జాతీయ టీ20ల్లో మొత్తం 30 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్ల్లో గెలిచింది. అంతేకాకుండా, గత ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే టీమిండియా ఏకంగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. గణాంకాల పరంగా చూస్తే ఇంగ్లాండ్పై భారత్దే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
ఇరు జట్ల వివరాలు..
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ శెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టోంగ్, ల్యూక్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




