Babar Azam: టీమిండియా గెలుపు కోసం పాక్ ప్రార్ధనలు.. బాబర్ సేన సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి..
పాక్.. నిన్న జరిగిన రెండో మ్యాచ్లో జింబాబ్వే చేతుల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో..

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్ ప్రయాణం దాదాపు ముగిసినట్లుగానే అనిపిస్తోంది. తొలి మ్యాచ్లో టీమిండియా చేతుల్లో ఓడిన పాక్.. నిన్న జరిగిన రెండో మ్యాచ్లో జింబాబ్వే చేతుల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో బాబర్ సేన కేవలం 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇప్పుడు పాక్ సెమీస్ అవకాశాలను క్లిష్టతరంగా మారాయి. బాబర్ సేన సెమీఫైనల్స్కు చేరాలంటే మిగిలిన మ్యాచ్లు అన్నీ గెలవడమే కాదు.. ఇతర జట్ల గెలుపోటములపై కూడా ఆధారపడాల్సి ఉంది.
గ్రూప్-2లో ఉన్న ఆరు జట్లలో భారత్ 2 విజయాలతో 4 పాయింట్లతో అగ్రస్థానంలో పటిష్టంగా ఉండగా.. పాక్ ఐదు, ఐర్లాండ్ ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో.. ఇక ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్లు కీలకం కానున్నాయి. అంతేకాకుండా నెట్ రన్రేటు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్లో భారత్ వైఫల్యాన్ని చూసి నవ్వుకున్న పాకిస్థానీలు.. ఇప్పుడు భారత్ గెలవాలంటూ కోరుకుంటున్నారు.
పాక్ సెమీస్ చేరాలంటే..
పాక్ సెమీస్ చేరాలంటే.. మిగతా మూడు మ్యాచ్ల్లో మెరుగైన రన్ రేట్తో విజయం సాధించాలి. అటు సౌతాఫ్రికాను భారత్ ఓడించాలి. ఇక జింబాబ్వే తన తదుపరి మూడు మ్యాచ్ల్లో రెండింట్లో ఓడాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ మరో మ్యాచ్లో ఓడిపోవాలి. అంటే భారత్ ఈ మూడు జట్లు సౌతాఫ్రికా, బంగ్లా, జింబాబ్వేను ఓడించాలి. ఇక సూపర్ 12లో భారత్ గనుక ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. అందుకే ఇప్పుడు భారత్ గెలవాలని పాక్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు తాము ఆడాల్సిన మిగతా మూడు మ్యాచ్ల్లో రెండింట్లో గెలిస్తే చాలు ఆ జట్ల ఖాతాలో ఆరు పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ చేరతాయి. పాక్ గరిష్టంగా ఆరు పాయింట్లు మాత్రమే సాధించే అవకాశం ఉండటంతో.. ఆ జట్టుకు మెరుగైన రన్రేట్ ఉండటం తప్పనిసరి.