
Vaibhav Suryavanshi : ఐపీఎల్ ప్రపంచంలోకి మెరుపు తీగలా దూసుకొచ్చిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేస్తూనే, అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లోనే శతక్కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఈ కుర్రాడి ప్రదర్శనపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఆటతీరు అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అతనికి అదృష్టం కూడా బాగా కలిసి వచ్చిందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన ఉతప్ప.. గత 12 నెలలుగా వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ను తాను గమనిస్తున్నానని తెలిపాడు. “వైభవ్ కచ్చితంగా టాలెంటెడ్ ప్లేయర్, అందులో సందేహం లేదు. కానీ ఇప్పటివరకు అతను చాలా వరకు లక్ మీద ఆధారపడి ఆడుతున్నాడు” అని ఉతప్ప అన్నాడు. ఆట స్థాయి పెరిగేకొద్దీ, అంటే క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వైభవ్ అసలైన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కొత్తగా వచ్చినప్పుడు బౌలర్లకు అతని టెక్నిక్ గురించి పెద్దగా అవగాహన ఉండదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఉతప్ప వివరించాడు.
వైభవ్ బ్యాటింగ్ స్టైల్, అతని వీక్ పాయింట్స్ ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయాయని ఉతప్ప అన్నాడు. “బౌలర్లకు ఇప్పుడు వైభవ్ను ఎక్కడ కట్టడి చేయాలో, ఏ లెంగ్త్లో బౌలింగ్ వేయాలో ఒక ఐడియా వచ్చేసింది. అందుకే రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్కు ఒక పెద్ద లెర్నింగ్ ప్రాసెస్ అవుతుంది” అని పేర్కొన్నాడు. ఈ సీజన్లో వైభవ్ పరుగులు చేసినా, గత ఏడాదిలాగా సునాయాసంగా రికార్డులు సృష్టించడం కష్టమని, ప్రత్యర్థులు అతన్ని ముప్పు తిప్పలు పెట్టడం ఖాయమని జోస్యం చెప్పాడు.
వైభవ్ సూర్యవంశీ ట్రాక్ రికార్డ్ చూస్తే అది మామూలుగా లేదు. రాజస్థాన్ రాయల్స్ ఇతనిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 7 ఐపీఎల్ మ్యాచుల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 252 పరుగులు చేశాడు. అండర్-19 టీమ్లోనూ దుమ్మురేపుతున్నాడు. అయితే ఉతప్ప చెప్పినట్లుగా, ఈ విశ్లేషణలు వైభవ్ ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయా లేదా అనేది రాబోయే సీజన్ నిర్ణయిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..