Hardik Pandya: ముంబైకి గుడ్బై.. బెంగళూరుకు హార్ధిక్ పాండ్యా! అఫీషియల్ అనౌన్స్మెంట్..
భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)ను తన శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చుకోనున్నాడు. ఫిట్నెస్, పునరావాసం కోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చాడు. పూర్తిస్థాయి వసతులను వినియోగించుకుంటూ, వ్యక్తిగత కోచ్లను కూడా నియమించుకుని, రాబోయే జింబాబ్వే సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు.

భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన క్రికెట్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)ను తన శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చుకునే ఉద్దేశంతో బెంగళూరుకు మకాం మార్చినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని శాశ్వత ప్రాక్టీస్ బేస్గా ఎంచుకున్న తొలి భారత క్రికెటర్గా హార్దిక్ నిలవనున్నాడు. సాధారణంగా భారత జట్టు కేంద్ర ఒప్పందం కలిగిన ఆటగాళ్లు గాయాల పునరావాసం, ఫిట్నెస్ పరీక్షలు లేదా జాతీయ శిబిరాల సమయంలో మాత్రమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఉపయోగిస్తారు. అయితే హార్దిక్ మాత్రం తన కెరీర్లో మిగిలిన కాలమంతా అక్కడే శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గుజరాత్లోని బరోడాకు చెందిన హార్దిక్ గత పదేళ్లుగా ప్రధానంగా ముంబైలో నివసిస్తూ, తన ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ శిక్షణా కేంద్రంలో సాధన చేసేవాడు. అయితే ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకుంటున్న అతను గత ఆరు నెలలుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలో కేంద్రానికి సమీపంలో నగర శివార్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శాశ్వతంగా అక్కడే నివసించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముంబైలోని లోయర్ పరేల్ నివాసం నుంచి ప్రతిరోజూ శిక్షణ కేంద్రానికి వెళ్లడం అసౌకర్యంగా మారడంతో బెంగళూరుకు మారాలని హార్దిక్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేంద్ర ఒప్పందం కలిగిన ఆటగాడిగా గాయాల నిర్వహణ, ఫిట్నెస్ పర్యవేక్షణ, నైపుణ్యాభివృద్ధి, పునరావాసం వంటి అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణతో పాటు బయట కూడా సాధన కొనసాగించేందుకు హార్దిక్ తన సొంత ఫిజియోథెరపిస్ట్తో పాటు వ్యక్తిగత స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సేవలను వినియోగించనున్నాడు. అలాగే నెట్ బౌలర్లతో ప్రత్యేకంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో వారికి తన సొంత ఖర్చుతో పారితోషికం చెల్లిస్తున్నట్లు కూడా సమాచారం. ప్రస్తుతం హార్దిక్ పునరావాస ప్రక్రియ కొనసాగుతోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం కొద్ది రోజుల విరామం తీసుకున్న అతను త్వరలోనే మళ్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరనున్నట్లు తెలుస్తోంది. రిటర్న్-టు-ప్లే ప్రోటోకాల్ను విజయవంతంగా పూర్తి చేస్తే యూకే పర్యటన అనంతరం జరగనున్న జింబాబ్వేతో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
