Rohit Sharma : నీకేమైనా పిచ్చిపట్టిందా ?..సూర్యకుమార్ యాదవ్పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
Rohit Sharma : టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత సారథి సూర్యకుమార్ యాదవ్ల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Rohit Sharma : టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత సారథి సూర్యకుమార్ యాదవ్ల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోహిత్ తనదైన శైలిలో సూర్యను ఆటపట్టించడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో, రోహిత్ ఎందుకు సూర్యను తిట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు రోహిత్ శర్మ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. శనివారం భారత్, అమెరికా మధ్య జరిగిన కీలక మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలోకి అడుగుపెట్టారు. ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. గత ఏడాది రోహిత్ సారథ్యంలోనే భారత్ ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పాత జట్టు సభ్యులను కలిసేందుకు రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్ళినప్పుడు ఒక సరదా సంఘటన జరిగింది.
టాస్ పడే సమయానికి రోహిత్ శర్మ మైదానం నుంచి వెనక్కి వెళ్తుండగా, ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరుగెత్తుకుంటూ రోహిత్ దగ్గరకు వచ్చాడు. “జల్దీ చెప్పు.. నేను ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా లేక బౌలింగ్ తీసుకోవాలా?” అని సరదాగా సలహా అడిగాడు. దానికి రోహిత్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, తన ట్రేడ్ మార్క్ స్టైల్లో పిచ్చా నీకు (పాగల్ హై క్యా)? బౌలింగ్ తీసుకో అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. రోహిత్ ఇచ్చిన ఆ కౌంటర్కు సూర్యతో పాటు అక్కడ ఉన్న వారందరూ నవ్వేశారు.
View this post on Instagram
ప్లేయర్లందరినీ ఆత్మీయంగా హత్తుకున్న రోహిత్, సిరాజ్ జట్టులోకి వచ్చినందుకు అభినందించారు. ఇషాన్ కిషన్ గత ప్రదర్శనలను కూడా మెచ్చుకున్నారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో ఉండగా, రోహిత్ కింద మైదానంలో నిలబడి వారితో మాట్లాడారు. “అక్కడ పైన ఉండటం కొంచెం వింతగా అనిపిస్తోంది కదా? నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడం నాకు కూడా వింతగానే ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించారు. రోహిత్ ఆటగాడిగా కాకుండా గెస్ట్గా స్టేడియంలో ఉండటం చూసి ఫ్యాన్స్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు.
రోహిత్ శర్మ సాక్షిగా టీమిండియా అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను సూర్యకుమార్ యాదవ్ (84 పరుగులు) ఆదుకున్నాడు. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. గత ఎడిషన్లో రోహిత్ సారథ్యంలో టీమిండియా వరుసగా 8 మ్యాచ్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గెలుపు గుర్రం ఆగకుండా ముందుకు సాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
