AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ మెట్రోలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో కీలకమైన పాతబస్తీ మెట్రో కారిడార్ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణ పనులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌ల కొనుగోలు, భూసేకరణ, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

Hyderabad: హైదరాబాద్ మెట్రోలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Cm Revanth Reddy On Hyderabad Old City Metro
Balaraju Goud
|

Updated on: Aug 11, 2026 | 4:45 PM

Share

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో కీలకమైన పాతబస్తీ మెట్రో కారిడార్ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణ పనులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌ల కొనుగోలు, భూసేకరణ, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ (HMRL)పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

పాతబస్తీ మెట్రోకు టెండర్లు షురూ..!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు అవసరమైన చోట్ల పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలన్నింటినీ సమన్వయం చేసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఢిల్లీ మెట్రో సలహాలు తీసుకోండిః సీఎం

పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విషయంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి అవసరమైన సాంకేతిక సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలోనూ ఈ కారిడార్ కీలకంగా మారనుంది.

పెరుగుతున్న రద్దీ.. అదనపు కోచ్‌లు కొనుగోలు..!

హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లకు అదనపు బోగీలు జత చేయాలని, ఇందుకోసం అవసరమైన కొత్త మెట్రో కోచ్‌ల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పీక్ అవర్స్‌లో రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

మరోవైపు డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు. వ్యాపార రంగంలోని వివిధ విభాగాల్లో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులను సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

అలాగే, గత ఏడాది నిర్వహించిన సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, జరిగిన పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడులను మరింత పెంచేందుకు కొత్త ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీ మెట్రో పనులకు టెండర్లు, భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత మెట్రో రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు కోచ్‌ల కొనుగోలుకు సీఎం ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు పడినట్లైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us