Balaraju Goud |
Updated on: Jul 13, 2021 | 10:20 PM
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో సుదీర్ఘంగా సాగింది. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య పరిష్కారంపై మంత్రి మండలి చర్చింది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేయడంతో పాటు.. చెప్పిన టైమ్కు చెప్పినట్టు ఉద్యోగాల భర్తీ జరగాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని మంత్రివర్గం ఆదేశించింది.
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు, నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గం ఆదేశించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపును చేపట్టాలని, ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులకు సూచించింది కేబినెట్.
నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో తాగునీటి సమస్యపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు అదనంగా మంజూరు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. లోకల్ కేటగిరీలో 50శాతం సీట్లు కేటాయించనున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్కు నివేదికలు సమర్పించాయి. నెలలోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తిచేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకు మూడోవైర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని భూముల విలువ పెంపు, రిజిష్ట్రేషన్ చార్జీల పెంపుపై కేబినెట్లో ప్రత్యేక చర్చ కొనసాగింది. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం లాండ్ పూలింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా లే అవుట్లను అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన అవకాశాలను, విధివిధాలాను అన్వేషించాలని మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.