- Telugu News Photo Gallery High Dosage Of Paracetamol Increases Risk Of Heart Attack And Hypertension According Study
Paracetamol Side Effects: పారాసెటిమాల్ టాబ్లెట్స్ అతిగా వాడేస్తున్నారా? అయితే పారాహుషారే! తస్మాత్ జాగ్రత్త!
Paracetamol Side Effects: పారాసెటిమాల్...పారాసెటిమాల్...పారాసెటిమాల్.....ఎవ్వరినోట విన్నా ఇదే మాట. ఏ ఇంట్లో చూసినా ఇదే పాట...
Updated on: Feb 14, 2022 | 1:45 PM

పారాసెటిమాల్...పారాసెటిమాల్...పారాసెటిమాల్.....ఎవ్వరినోట విన్నా ఇదే మాట. ఏ ఇంట్లో చూసినా ఇదే పాట.... తుమ్మినా, దగ్గినా రెడీ టు టేక్ మెడిసిన్ పారాసెటిమాల్. ఇది లేని ఇల్లులేదా? అంటే నో ఛాన్స్. జ్వరమా? తలనొప్పా? ఒళ్లు నొప్పులా? అయితే వేసెయ్ పారాసెటిమాల్.... అంతే.... షీట్లకు షీట్లే మింగేస్తోన్న జనం. కరోనా కాలంలో ఎడాపెడా వాడేస్తోన్న వైనం. డాక్టరెందుకు.. చీటీ ఎందుకు... ఇచ్చెయ్ కన్సల్టెన్సీకి చెల్లుచీటీ.. ఇక వేసెయ్ డోలో సిక్స్ ఫిఫ్టీ..

ఇంతకీ ఇష్టారాజ్యంగా పారాసెటిమాల్ వాడేయొచ్చా? ఎంత జబ్బుకైనా అంత మందేనా? విచ్చలవిడిగా పారాసెటిమాల్ వాడేవాళ్ళకి లేటెస్ట్ స్టడీస్ స్ట్రాంగ్ వార్నింగ్స్ బెల్స్ మోగిస్తున్నాయి. ఎడా పెడా పారాసెటిమాల్ వాడే వాళ్లూ పారాహుషార్ అంటున్నారు వైద్యులు. ఎడాపెడా పారాసెటిమాల్ వాడేస్తున్నారా? అయితే అది మిమ్మల్ని వాడేస్తుంది జాగ్రత్త. యిప్పుడిదే విషయాన్ని స్కాట్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ లేటెస్ట్ స్టడీస్ ఖాయం చేశాయి.

ప్రాణాలు కాపాడాల్సిన మందు అతిగా వాడితే విషంగా మారుతోంది. మితిమీరితే అమృతం విషమౌతుందన్నమాట. ప్రతి చిన్న నొప్పికీ పారాసెటిమాల్ని వాడేసేవారికి తాజా అధ్యయనం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాయి. దీర్ఘకాలంపాటు పారాసెటిమాల్ వాడితే రక్తపోటు పెరుగుతుందని, వారిలో హార్ట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ తాజా అధ్యయనం తేల్చి చెప్పడం యిప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గుండెపోటు, స్ట్రోక్లకు పారాసిటమల్ ఒక ముఖ్య కారకమని తాజా అధ్యయనంలో తేలిందని ఎడిన్బర్గ్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్ ప్రొఫెసర్ జేమ్స్ డియార్ వెల్లడించారు.

దీర్ఘకాలిక నొప్పులు ఉన్నవారికి వీలైనంత తక్కువ మోతాదులో పారాసిటమల్ ఇవ్వాలని పరిశోధకులు డాక్టర్లను కోరారు. అయితే అధిక రక్తపోటు ఉన్నవారిని, గుండెపోటు వచ్చే రిస్క్ ఉన్నవారి విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. గుండెపోటు, స్ట్రోక్స్ ముప్పు ఉన్న వారికి పారాసెటిమాల్ టాబ్లెట్స్ ఇచ్చే విషయంలో డాక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఈ లేటెస్ట్ అధ్యయనం తేల్చి చెపుతోంది. అయితే జ్వరానికీ, తలనొప్పికీ పెయిన్ కిల్లర్ తీసుకోవడం సురక్షితమేనంటున్నారు. అయితే వైద్యులు పేషెంట్లకు పారాసెటిమాల్ మందులు రాసే ముందు లాభనష్టాలను తరచి చూసుకోవాలని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది.

కరోనా తర్వాత డోలో 650 ప్రతి ఇంటా తప్పనిసరి మందుగా మారిపోయింది. ఎంతలా అంటే మన తెలంగాణలోనే రోజుకి ఐదులక్షలకుపైగా పారాసెటిమాల్ మాత్రలను మింగేస్తోన్నారు జనం. 2018లో స్కాట్లండ్లో అయిదు లక్షలమందిలో.. ప్రతి 10 మందిలో ఒకరికి పెయిన్కిల్లర్ రాసిచ్చారు వైద్యులు. బ్రిటన్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యాంటీ ఫీవర్ ఔషధంగా పరిచితమైన డోలో 650 మాత్రలు కరోనా టైమ్లో 350 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి అందుకే వైద్యులను సంప్రదించకుండా ఎడాపెడా పారాసెటిమాల్లను వాడటం మానెయ్యాలంటున్నారు వైద్యరంగ నిపుణులు. సొంత వైద్యం కొంత మానకపోతే పారాసెటిమాల్తో ముప్పుతప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తపోటు ఉన్న 110 మంది రోగులపై జరిపిన పరిశోధనల్లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. రక్తపోటు ఉన్న వారిని రెండు గ్రూపులుగా చేసి, ఒక గ్రూపులోని వారికి ఒక గ్రాము(1000మిల్లీగ్రాముల) పారాసెటిమాల్ను రోజుకి నాలుగుసార్ల చొప్పున రెండు వారాల పాటు ఇచ్చారు శాస్త్రవేత్తలు. మరో గ్రూపులోని వారికి ఎటువంటి మందులేని ట్యాబ్లెట్లు ఇచ్చారు.

పారాసెటిమాల్ తీసుకున్న వారిలో నాలుగు రోజుల్లోనే రక్తపోటు పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. పారాసెటిమాల్ వాడకంతో హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్స్ 20 శాతం పెరిగినట్లు గుర్తించారు. నిజానికి వ్యక్తిలో గతంలో ఉన్న వ్యాధులు, బరువు, ఎత్తు, వాతావరణం ఆధారంగా మోతాదు నిర్ణయిస్తారు. జ్వరం వచ్చిన 6 గంటల తర్వాత మాత్రమే 500 mg పారాసెటమాల్ తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్ ఏదైనా మోతాదుకు మించి వాడితే ప్రమాదమేనని అంటున్నారు వైద్యులు. పారాసెటిమాల్ పుట్టిన బిడ్డ నుండి వందేళ్లు ఉన్న వాళ్ళ వారికి వాడవచ్చు. టైమ్ ప్రకారం 10 మిల్లీగ్రామ్స్ పర్ కిలో వాడవచ్చు. 50mg వరకు వాడవచ్చు. కానీ ఈ మోతాదు మించితే ఎలాంటి వారికైనా ఇబ్బంది తప్పదు అంటున్నారు డాక్టర్ రంగయ్య. మొదటగా లివర్ పై ఎఫెక్ట్ పడుతుంది అని ఇది లాంగ్ టర్మ్ లో ప్రభవం ఉంటుంది అని వైద్యులు తెలిపారు...మరింత మోతాదు పెరిగితే ప్రాణాలకు ప్రమాదం అంటున్నారు వైద్యులు.

దీర్ఘకాలంగా పారాసిటమల్ వాడకానికి, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగడానికి సంబంధం ఉందని గతంలో అమెరికాలో చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. కానీ, దానివల్లే ఇది జరుగుతుందని నిరూపించలేదు. అమెరికా సూచన ప్రకారం పెద్దలకు జ్వరం ఉంటే 325 mg నుంచి 650 mg పారాసెటమాల్ మోతాదు 4 నుంచి 6 గంటల వ్యవధిలో ఇవ్వొచ్చు. మధ్యలో విరామం 8 గంటల వరకు ఉంటే వారికి 1000 mg వరకు మందులు ఇవ్వచ్చు. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉంటే నొప్పికి 325 నుంచి 650 మిల్లీ గ్రాముల పారాసెటమాల్ 4 నుంచి 6 గంటల వ్యవధిలో తీసుకోవాలి. 1000 మిల్లీ గ్రాముల ఔషధం 6 నుంచి 8 గంటల విరామంతో తీసుకోవచ్చు.




