- Telugu News Photo Gallery Engineering student who donated his organs to six people and saved their lives
తాను మరణించి.. ఆరుగురికి ప్రాణదానం చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!
తాడికొండ మండలం నిడు ముక్కల వద్ద గత శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు చనిపోగా మరో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్న అమర్ బాబు కాలేజ్ విద్యార్ధులతో బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Updated on: Jan 27, 2026 | 1:21 PM

ప్రమాదంలో గాయపడిన తెనాలి మండలం పిన పాడుకు చెందిన అమర్ బాబును ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో జీవన్ దాన్ కోఆర్డినేటర్లు అమర్ బాబు కుటుంబ సభ్యులను సంప్రదించారు. అవయవ దానం చేయాలని సూచించారు. అమర్ బాబు అవయవాలతో మరో ఆరు గురికి ప్రాణదానం చేయవచ్చని చెప్పారు. మానవతా ద్రుక్పథంతో ముందుకు రావాలన్నారు. జీవన్ దాన్ కోఆర్డినేటర్లతో పాటు వైద్యులు అమర్ బాబు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో అవయవ దానం చేసేందుకు ఒప్పుకున్నారు.

జీవన్ దాన్ ట్రస్ట్ నిబంధనల ప్రకారం గుండెను తిరుపతి తరలించేందుకు వైద్యులు సిద్దమయ్యారు. గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా గుండెను తొలగించి గ్రీన్ ఛానల్లో తిరుపతి పంపించారు.

రమేశ్ ఆసుపత్రి నుండి గుండెను తరలిస్తున్న సమయంలో అమర్ బాబు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకొని అమర్ బాబు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడ నుండి తిరుపతికి ప్లైట్ లో గుండెను పంపించారు. ఇక లివర్, కిడ్నీలను గుంటూరు రమేష్ ఆసుపత్రిలోనే ట్రస్ట్ నిబంధనలు మేరకు ఇతరులకు దానం చేశారు.

అవయవదానంతో మరో ఆరుగురు ప్రాణం ఇవ్వచ్చని బ్రెయిన్ డెత్ కేసుల్లో కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఇక తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ పినపాడులోని కుటుంబ సభ్యులను పరామర్శించి మానవతా ద్రుక్పథంతో అవయవ దానం చేసిన వారిని కొనియాడారు. పెద్ద మనస్సుతో అవయవ దానం చేయడంతో కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపినట్లైందన్నారు.
