Venkata Chari |
Updated on: Dec 07, 2021 | 8:28 AM
India Vs South Africa: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుండడంతో దానికి సంబంధించిన జట్టును కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనకు ముందు, భారత జట్టులోకి ఎంపిక అయ్యే ఆటగాళ్లు ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నారు. భారతదేశం-ఏ కోసం అనధికారిక టెస్ట్ సిరీస్ను ఆడుతున్నారు. బ్లూమ్ఫోంటైన్లో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్లో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణింస్తున్నారు.
మూడో అనధికారిక టెస్టు తొలి ఇన్నింగ్స్లో నవదీప్ సైనీ తన అసమాన బౌలింగ్తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. సోమవారం నవదీప్ సైనీ దక్షిణాఫ్రికా-ఏ జట్టుకు చుక్కలు చూపించాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా-ఏ 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. నవదీప్ సైనీతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్కు ఒక వికెట్ దక్కింది. గత మ్యాచ్లో కూడా నవదీప్ సైనీ మొత్తం 5 వికెట్లు తీశాడు. అయితే ఇలాంటి ప్రదర్శన చూసినప్పటికీ, అతను టీమ్ ఇండియాలోకి రావడం కష్టమనే తెలుస్తోంది.
మంగళవారం లేదా బుధవారం ముంబైలో టీమ్ ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అందులో నవదీప్ సైనీకి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్లకు స్థానం ఖాయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నవదీప్ సైనీ ఐదో ఫాస్ట్ బౌలర్గా జట్టులో చోటు కల్పిస్తారా? లేదో చూడాలి.
భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మూడు టెస్టుల సిరీస్ తర్వాత టీమిండియా మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.