పవన్, త్రివిక్రమ్ కాంబో సెట్.. హిట్టు కొట్టి లెక్కసరి చేస్తానంటున్న గురూజీ
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంకొక్క సినిమా వస్తే బాగుంటుందిరా.. అజ్ఞాతవాసి లెక్క సరిచేస్తే చాలు.. ఇంకేం అవసరం లేదు.. ఒక్క బ్లాక్బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చేయకపోయినా పర్లేదు.. బయటికి చెప్పట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదే. ఇప్పుడదే జరిగేలా కనిపిస్తుంది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరేలా ఉంది. ఈ సెన్సేషనల్ కాంబోపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది, జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు.. అజ్ఞాతవాసి లాంటి చేదు నిజం కూడా గుర్తుకొస్తుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 06, 2024 | 12:51 PM

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంకొక్క సినిమా వస్తే బాగుంటుందిరా.. అజ్ఞాతవాసి లెక్క సరిచేస్తే చాలు.. ఇంకేం అవసరం లేదు.. ఒక్క బ్లాక్బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చేయకపోయినా పర్లేదు.. బయటికి చెప్పట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదే. ఇప్పుడదే జరిగేలా కనిపిస్తుంది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరేలా ఉంది. ఈ సెన్సేషనల్ కాంబోపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది, జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు.. అజ్ఞాతవాసి లాంటి చేదు నిజం కూడా గుర్తుకొస్తుంది. ఆకాశమంత అంచనాలతో వచ్చి.. పాతాళానికి పడిపోయిన సినిమా ఇది. అందుకే ఆరేళ్లైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇటు పవన్.. అటు గురూజీ ఫ్యాన్స్.

ఒక్క ఫ్లాప్ వచ్చింది కదా అని.. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్పై అంచనాలు తగ్గవు.. నిజం చెప్పాలంటే ఈ కాంబో కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. పవన్కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఎలాగైనా బ్లాక్బస్టర్ ఇచ్చి ఆ లెక్క సరిచేయాలని చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత భీమ్లా నాయక్కు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు గురూజీ. ఇప్పుడు ఓ సినిమాకు సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టం అనుకుంటే.. త్రివిక్రమ్తో సినిమా అనేది కలే. కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వప్రసాద్. ఈ మధ్యే బ్రో సినిమాను ఇదే బ్యానర్లో చేసారు పవన్. దీనికి కూడా త్రివిక్రమ్ మాటలు రాసారు. ఈ నిర్మాతే పవన్, త్రివిక్రమ్ను కలపడానికి ప్రయత్నిస్తున్నారు.

పవన్ సినిమాల్లో ఓజి ఒక్కటే 2024లో వచ్చేలా కనిపిస్తుంది. హరిహర వీరమల్లు, ఉస్తాద్ కూడా వీలు చూసి పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ మంచి కథతో వస్తే ఈ కాంబోను కలపాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అన్నీ అనుకున్నట్లు జరిగి ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే.. పవన్, త్రివిక్రమ్ ఫ్యాన్స్కు అంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదేమో..?




























