TELUGU POLITICS: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ రచ్చ రాజకీయం.. ముంపు మండలాలపై అదే చర్చ.. హోదాపై పాడిందే పాడిన కేంద్రం

‘‘ప్రత్యేక హోదా అంశానికి 14వ ప్లానింగ్ కమిషన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.. 15వ ప్లానింగ్ కమిషన్ కూడా అవే సిఫారసులను కంటిన్యూ చేసింది.. దాంతో కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటాను 42 శాతానికి పెంచాం...

TELUGU POLITICS: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ రచ్చ రాజకీయం.. ముంపు మండలాలపై అదే చర్చ.. హోదాపై పాడిందే పాడిన కేంద్రం
Modi
Follow us

|

Updated on: Jul 19, 2022 | 6:50 PM

TELUGU POLITICS ROCKING AGAIN ON AP SPECIAL STATUS AND BHADRACHALAM SAFETY: ప్రత్యేక హోదా.. ఎనిమిదేళ్ళుగా తరచూ చర్చకొస్తున్న కీలక అంశం. పాడిందే పాడెరా.. అన్న రీతిలో కేంద్రం సమాధానం. ఇవ్వడం కుదరదని తెలిసినా ఆనాడు అధికార కాంగ్రెస్ (CONGRESS PARTY), విపక్ష బీజేపీ (BJP) ఎందుకు ఏపీ ప్రజలను వంచించాయో అర్థం కాని వ్యవహారం. 2014లో ఫిబ్రవరిలో ఆగమేఘాల మీద రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించినపుడు స్టేక్ హోల్డర్లందరు చర్చకు సానుకూలంగా వుండి వుంటే ఈ అంశంతోపాటు చాలా అంశాలు ఈపాటికే తేలిపోయి వుండేవి. ప్రత్యేక హోదా ఇస్తామన్న ఆనాటి అధికార పక్షం ఏప్రాతిపదికన ఇస్తామన్నది తెలియజేయలేదు. మొదట్నించి ప్రత్యేక తెలంగాణ (TELANGANA)కు అనుకూలంగా వున్న బీజేపీ.. హైదరాబాద్ (HYDERABAD) మహానగరాన్ని కోల్పోతున్న ఏపీకి ఏవిధంగా కాంపెన్సేట్ చేస్తారన్నది చర్చించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఆనాడు తెలిసిన వాళ్ళెవరు ఏపీ (AP) విషయంలో న్యాయం కోసం చర్చకు యత్నించలేదు. ఎంతసేపు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అడ్డుకోవాలన్న తాపత్రయం ఏపీ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తే.. దాన్ని ఎలాగైనా ఆమోదింపజేయాలన్న పంతంలో యుపీఏ (UPA) ప్రభుత్వం వ్యవహరించింది. బిల్లును అడ్డుకోవడానికి చివరికి పెప్పర్ స్ప్రేను సైతం వాడుకున్న పరిస్థితి. ఆనాటి విపక్షం బీజేపీగానీ.. విభజనకు సానుకూలంగా వ్యవహరించిన పార్టీలుగానీ పార్లమెంటు (PARLIAMENT) ఉభయసభల్లో చర్చకు సీరియస్‌గా యత్నించలేదు. చివరికి చట్టసభల గేట్లు మూసి మరీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పాసయ్యిందనిపించారు. ఇదే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRAMODI) అంటే ఆయన తెలంగాణకు వ్యతిరేకి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. చట్టాన్ని తప్పుపట్టడం, చట్టం పాసైన విధానాన్ని తప్పుపట్టడం.. ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించని వారో.. లేక రాజకీయం చేయాలనుకునే వారో ఈ కామెంట్లకు పాల్పడుతుంటారు. మొత్తానికి ఇపుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీ అడుగుతూనే వుంటుంది. కేంద్రం చెప్పిందే చెబుతూనే వుంటుంది.

2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు (AP STATE REORGANISATION ACT 2014) ఒకసారి ఆమోదించబడిన తర్వాత అది చట్టమే. దాన్ని ఎలాగైనా అమలు చేయాలన్న దృఢసంకల్పం కేంద్ర ప్రభుత్వంపై వుంది. ఆమాటకొస్తే.. కేంద్రంలోని బీజేపీ (ఎన్డీయే) ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మొక్కుబడి యత్నాలు మినహా సీరియస్ ప్రయత్నాలు చేసింది లేదని అందరికి తెలుసు. పలు మార్లు మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరగడం.. సాధ్యాసాధ్యాలను చర్చించి.. ముగించడం జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని 2014-2019 మధ్య తమకు మిత్రపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీ (TELUGUDESHAM PARTY)కి, ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CHIEF MINISTER CHANDRABABU)కు కేంద్రం తేటతెల్లం చేసింది. దాంతో ప్రత్యేక హోదా అంత అవసరం కాదనే స్థాయిలో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు కూడా. కానీ ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగానే వుందని గ్రహించిన చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి హోదా అంశాన్ని ఆధారం చేసుకుని బీజేపీకి దూరం జరిగారు. చిరకాల ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ నేతలకు దగ్గరయ్యారు. రాహుల్ గాంధీ (RAHUL GANDHI)తో డయాస్ కూడా పంచుకున్నారు. అయితేనేం ఏపీలో ఆయన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఘోరపరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కూడా ప్రత్యేక హోదా అంశం ఏపీలో తరచూ వినిపిస్తూనే వుంది. అప్పుడప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తూనే వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CHIEF MINISTER YS JAGAN) సహా ఏపీకి చెందిన వైసీపీ మంత్రులు, పార్లమెంటరీ పార్టీ నేతలు ఎప్పుడు ఢిల్లీ (DELHI)కి వెళ్ళినా స్పెషల్ స్టేటస్ కోరుతూ నివేదించడం జరుగుతూనే వుంది. వాటిపై కేంద్ర మంత్రులు నేరుగా స్పందించనప్పటికీ.. పార్లమెంటు వేదికగా ఏ ఎంపీ అయినా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే మాత్రం హోదా ఇవ్వడం కుదరదని చెబుతూ వస్తున్నారు. తాజాగా జులై 19న సైతం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (SRIKAKULAM MP RAMMOHANNAIDU) (టీడీపీ) అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ (NITYANANDA ROY).. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మరోసారి పాడిందే పాడేశారు. ‘‘ప్రత్యేక హోదా అంశానికి 14వ ప్లానింగ్ కమిషన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.. 15వ ప్లానింగ్ కమిషన్ కూడా అవే సిఫారసులను కంటిన్యూ చేసింది.. దాంతో కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటాను 42 శాతానికి పెంచాం.. రెవెన్యూ లోటు వున్న రాష్ట్రాలకు అదనపు నిధులను కేటాయించాం.. అందులో ఏపీ కూడా వుంది.. ఇక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని చాలా అంశాలను నెరవేర్చాం.. కేవలం కొన్ని మాత్రమే పెండింగులో వున్నాయి.. వివాదాస్పద అంశాల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 28 భేటీలను నిర్వహించాం.. ’’ అని నిత్యానందరాయ్ తన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఇప్పటికి పలు మార్లు హోదా ఇవ్వలేమని పరోక్షంగాను, ప్రత్యక్షంగాను మోదీ ప్రభుత్వం తేల్చేసింది. అయినా ఏపీలో అటు విపక్షం.. ఇటు అధికార పక్షం ఈ అంశాన్ని తరచూ లేవనెత్తుతూనే వున్నాయి. నిజానికి 2014లో పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదానికి వచ్చినపుడు కాస్తైనా చర్చ జరిగి వుంటే అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమా కాదా అన్నది తేలిపోయేది. కానీ ఆనాడు చర్చకు ఏ మాత్రం అనుకూల వాతారవణం లేకపోయింది. అందుకు కారణం ఎవరో ఇపుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ వారే (ఆనాడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను అడ్డుకున్నవారు) ఈనాడు హోదా రాకపోవడానికి కారకులనడం మాత్రం నిష్టుర సత్యం. రేప్ అనివార్యమైనపుడు దాన్ని అనుభవించాలని ఓ సినీ, నవలా రచయిత 80వ దశకంలో రాశాడు. (నా అభిప్రాయం కాదు) ఈ సూత్రాన్ని కాస్తైన పాటించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినపుడు చర్చకు ఏపీ ప్రజాప్రతినిధులు సిద్దమై వుంటే అసలు ఏ ప్రాతిపదికన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యుపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది ? ఆ ప్రాతిపదికన హోదా ఇవ్వడం సాధ్యమా ? అసలు హోదా ఇస్తే ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి ? అంతకు ముందు నుంచి ప్రత్యేక హోదా కోరుతున్న రాష్ట్రాల మాటేమిటి? ఇత్యాది అంశాలపై క్లారిటీ వచ్చేది. కానీ ఆనాడు ఆ అవకాశం లేకపోయింది. లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభలో కాస్త బెటరే అయినా పెద్దగా చర్చ మాత్రం జరగలేదు. వెంకయ్యనాయుడి చొరవతో కొన్ని చిన్న సవరణలు, క్లారిటీలు మాత్రం వచ్చాయి. సో.. హోదా అంశాన్ని ఆధారంగా చేసుకుని ఎవరు ఎవరిని నిందించినా పెద్దగా ప్రయోజనమైతే ప్రస్తుతానికి లేదు. అదేసమయంలో హోదా రాకపోవడానికి మాత్రం దాదాపు అన్ని పక్షాలు కారణమేనంటే కాదని అనలేని పరిస్థితి.

ఇక తాజాగా గోదావరి వరదల (GODAVARI RIVER FLOODS) నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య భద్రాచాలం (BHADRACHALAM), ఏపీలో కలిపిన ముంపు మండలాల అంశంపై రాజకీయం రగులుకుంది. గోదావరి వరదలకు క్లౌడ్ బరస్ట్‌ (CLOUD BURST)తో విదేశీ కుట్ర జరిగిందన్న లాజిక్ లేని వాదనను వినిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (TELANGANA RASHTRA SAMITI) వర్గాలు.. తాజాగా ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపితేనే భద్రాచలం పుణ్యక్షేత్రానికి భద్రత లభిస్తుందనడం మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ (PUVVADA AJAY) చేసిన కామెంట్లపై ఏపీలో రచ్చ రాజుకుంది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ (BOTSA SATYANARAYANA), పేర్ని నాని (PERNI NANI), రాంబాబు (RAMBABU) స్పందించారు. ఆ అయిదు మండలాలను తెలంగాణలో కల్పడం కాదు.. భద్రాచలాన్ని ఏపీకి అప్పగిస్తే దాని భద్రతకు తమదీ పూచీ అన్నారు. రాష్ట్రం విడిపోయిన వెంటనే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే జరిగింది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆనాడు ఆమోదించిన ప్రతీ ఒక్కరు ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు అంగీకరించారనే చెప్పాలి. అదే చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పాటైతే స్వాగతించిన వారు.. ఏడు మండలాలు ఏపీలో కల్పడం కుట్ర అని వ్యాఖ్యానించడం విడ్డూరమే అనాలి. తాజా వరదల్లో వేలాది మంది నిరాశ్రయులైతే.. నాలుగైదు రోజులుగా వారు తీవ్ర దుర్బర జీవితాలను గడుపుతుంటే వారి గురించి మాట్లాడకుండా.. వారిని ఆదుకోవడంలో వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకోకుండా.. ఆ అయిదు మండలాలు మాతో వుంటే పరిస్థితి ఇలా వుండేది కాదంటూ మాట్లాడే వారిది బాధ్యతారాహిత్యం అనక తప్పదు. అటు ప్రత్యేక హోదా అయినా.. ఇటు ఏడు మండలాల విలీనం అయినా 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఉభయ సభలు వేదికగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ సంపూర్ణంగా జరిగి ఇవాళ ఈ వికృత రాజకీయానికి తావుండేది కాదనేది సత్యం.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..