కాలేజీ వెబ్సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!
సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్సైట్ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది.

సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్సైట్ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది.
బీటెక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్లో ప్రవేశం పొందడంలో విఫలమైన ఓ విద్యార్థి, ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్సైట్లోని ఓ భాగాన్ని హ్యాక్ చేశాడు. “సైట్ హ్యాక్ చేయబడింది.. నాకు కావలసిందల్లా ఒక న్యాయమైన అవకాశం మాత్రమే” అనే సందేశాన్ని ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం సోషల్ మీడియా వేదికలు ఎక్స్, రెడ్డిట్లలో హ్యాక్కు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ తానే ఈ చర్యకు పాల్పడ్డానని విద్యార్థి ప్రకటించాడు. తన ఉద్దేశం సంస్థకు నష్టం కలిగించడం కాదని, తన సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని విద్యార్థి పేర్కొన్నాడు. అయితే అనుమతి లేకుండా ఏ సంస్థ డిజిటల్ వ్యవస్థల్లోకి ప్రవేశించడం సరైన మార్గం కాదని ఐఐటీ కాన్పూర్ స్పష్టం చేసింది.
ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనింద్ర అగర్వాల్ మాట్లాడుతూ, ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అందులో విధానపరమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ విద్యార్థి భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఐఐటీ కాన్పూర్కు చెందిన సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ అయిన C3iHubలో ఇంటర్న్షిప్ కోసం అతడిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఐఐటీ కాలేజీ ప్రవేశాల కోసం తమ సామర్థ్యాలను చూపించేందుకు విద్యార్థులకు ఇప్పటికే హ్యాకథాన్లు, ఇతర సాంకేతిక అవకాశాలు కల్పిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. ఎంపిక ప్రక్రియలో తన ప్రతిభను నిరూపించుకోలేకపోయిన విద్యార్థి, తన నైపుణ్యాలను చూపించేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులు భావించినప్పటికీ, చివరకు శిక్షాత్మక చర్యల కంటే మార్గదర్శక అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలను ప్రోత్సహించబోమని, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎదగాలనుకునే వారు ఎథికల్ హ్యాకింగ్, బాధ్యతాయుతమైన సమాచార వెల్లడి వంటి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని ఐఐటీ కాన్పూర్ సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
