అయోధ్య విరాళాల కేసులో సంచలన ట్విస్ట్.. సిట్ ఎదుట ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కీలక వాంగ్మూలం!
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, దొంగతనం కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరై పలు కీలక విషయాలను వెల్లడించారు.

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, దొంగతనం కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరై పలు కీలక విషయాలను వెల్లడించారు.
నేను ఏ తప్పు చేయలేదు: చంపత్ రాయ్
ఈ దొంగతనం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తాను ఏ తప్పు చేయలేదని చంపత్ రాయ్ అధికారుల ఎదుట స్పష్టం చేశారు. తన వద్ద సుదీర్ఘకాలంగా నమ్మకంగా పనిచేసిన తిన్నూ యాదవ్ (రామశంకర్ యాదవ్) తనను తీవ్రంగా మోసం చేశాడని ఆయన తెలిపారు. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శిగా భక్తులు సమర్పించే కానుకల నిర్వహణలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, అందరి నమ్మకాన్ని చూరగొన్న తిన్నూ యాదవ్ ఇలాంటి ఘోరానికి పాల్పడతాడని ఎవరూ ఊహించలేదన్నారు. కానుకల దుర్వినియోగం ఆరోపణలు రాగానే తానే స్వయంగా చొరవ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిందితుల అరెస్టుకు పూర్తిగా సహకరించానని చంపత్ రాయ్ వాంగ్మూలం ఇచ్చారు.
ఉద్యోగుల నియామకాలపై సిట్ ఆరా..!
విరాళాల లెక్కింపు ప్రక్రియలో ట్రస్ట్ సభ్యుల బంధువులు, పరిచయస్తులను నియమించడంపై సిట్ అధికారులు చంపత్ రాయ్ను గట్టిగా ప్రశ్నించారు. కేవలం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే ఈ నియామకాలు జరిగాయని, ఈ నిర్ణయంలో ట్రస్ట్ సభ్యులైన డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ రావుల ప్రమేయం కూడా ఉందని ఆయన వివరించారు. ఈ కేసులో ఇప్పటికే తిన్నూ యాదవ్తో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, వారు జులై 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.
ట్రస్ట్ – ఎస్బీఐ ఒప్పందంలో లోపాలు..!
సిట్ దర్యాప్తులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఫిబ్రవరి 2025లో కుదిరిన అవగాహన ఒప్పందంలోని అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం.. విరాళాల పెట్టెలను తెరవడం, లెక్కింపు సమయంలో ట్రస్ట్, బ్యాంకు అధికారులు ఇద్దరూ కలిసి ఉండాలి. కౌంటింగ్ సిబ్బందికి డ్రెస్ కోడ్ పాటించాలి, అలాగే ఒకే ఉద్యోగి ఎక్కువ కాలం ఒకే చోట ఉండకుండా బ్యాంకు అధికారులను నెలవారీగా మార్చాలి. కానీ ఈ నియమాలను సమర్థవంతంగా పాటించలేదని దర్యాప్తులో తేలింది. కౌంటింగ్ రూమ్లోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఉద్యోగులను క్రమం తప్పకుండా తనిఖీ చేశారా లేదా అనే కోణంలో సిట్ రిజిస్టర్లను, నివేదికలను సమీక్షిస్తోంది.
నిందితుల ఆస్తులపై సిట్ నిఘా..
అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులు గత మూడేళ్లలో సంపాదించిన చరాచర ఆస్తుల పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు కొనుగోలు చేసిన భూమి, ఇళ్లు, ఆభరణాలు, వాహనాల గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితుల అధికారిక ఆదాయ వ్యయాలను, వారి ప్రస్తుత ఆస్తులతో పోల్చి చూసి.. విరాళాల ద్వారా అక్రమంగా సంపాదించిన నిధులను ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారనే విషయాలను నిర్ధారించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. చంపత్ రాయ్ ఇచ్చిన తాజా స్టేట్మెంట్ను మిగిలిన నిందితుల సాక్ష్యాలతో సరిపోల్చుతూ, ఈ చోరీ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
