దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇందులో భాగంగా కొన్నింటిపై నిషేధం విధించింది. ఇందులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంతో పాటుగా పాన్ మసాలా తయారీ, అమ్మకాలపై కూడా మార్చి 25న నిషేధం విధించింది. తాజాగా ఈ పాన్ మాసాలా తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ యూపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గుట్కా పాన్ మసాలా తయారీ, అమ్మకాలపై మాత్రం నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగీ సర్కార్ తెలిపింది.
కాగా.. పాన్ మసాలా ఉమ్మివేయడం ద్వారా కూడా కరోనా మహమ్మారి వ్యాపించే అవకాశం ఉందన్న అభిప్రాయంతో యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదిలా ఉంటే.. యూపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో యోగీ సర్కార్ లాక్డౌన్ అమలు చేయడంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.