Nitin Gadkari: రోడ్ యాక్సిడెంట్స్లో ప్రాణనష్టం తగ్గించేందుకు.. ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర మంత్రి కీలక సూచన
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక సూచన చేశారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక సూచన చేశారు. చిన్న సైజు ఎకానమీ కార్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పేదలు, దిగువ మధ్యతరగతి వారు ఎక్కువగా ఎకానమీ కార్లను వినియోగిస్తుంటారని గుర్తుచేశారు. అయితే వీటిలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడంతో ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. వాహనదారుల భద్రత కోసం ఉద్దేశించిన ఎయిర్ బ్యాగ్స్ను ధనవంతులు వినియోగించే ప్రీమియం కార్లకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? అని ఆటోమొబైల్ సంస్థలను గడ్కారీ ప్రశ్నించారు. ఎకానమీ కార్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తే వాటిని వినియోగించే మధ్యతరగతి ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లభిస్తుందని అన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మధ్యతరగతి ప్రజల మరణాలను గణనీయంగా తగ్గించొచ్చని గడ్కారీ వ్యాఖ్యానించారు.
చిన్న ఎకానమీ కార్లలో కనీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండేలా చూడాలని అన్ని ఆటోమొబైల్ కంపెనీలను కోరుతున్నట్లు చెప్పారు. ఎయిర్ బ్యాగుల కారణంగా ఎకానమీ కార్ల ధరలు మూడు నాలుగు వేల రూపాయలు పెరిగే అవకాశముంది..అయినా పర్వాలేదు.. దేశంలోనే పేదలు, దిగువ మధ్యతరగతి వాహనదారి ప్రాణాలకు మరింత రక్షణ లభిస్తుందని వ్యాఖ్యానించారు.
అలాగే ధనవంతుల వినియోగించే లగ్జరీ కార్లకు 8 ఎయిర్ బ్యాగ్స్ కల్పిస్తూ.. దానికంటే తక్కువ శ్రేణి వాహనాలకు మూడునాలుగు ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. వాహనదారులు అందరి ప్రాణాలకు సమానమైన రక్షణ కల్పించేలా ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ బ్యాగ్స్ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Also Read..
పాపం బిడ్డ.. ప్రయోగం ఫెయిల్ అయ్యింది.. వీపు వాచిపోయింది.. మస్త్ కామెడీ వీడియో మీకోసం..
IPL 2021: ధోని 8 సిక్సర్లు కొట్టి ముంబైని హెచ్చరించాడు..! వీడియో చూస్తే అదిరిపోతారంతే..?