PM Modi: నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. బాలెన్షాకు ప్రధాని మోదీ ఫోన్.. సాయం చేస్తామని భరోసా..
నేపాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా రసువా జిల్లాలో భారీ నష్టం జరిగింది. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం కాగా, వారిలో 105 మంది భారతీయులు ఉన్నారు. వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి, భారత్ తరఫున పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తర నేపాల్లో అపారనష్టం జరిగింది. రసువా జిల్లాలో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా వేలాదిమంది గల్లంతయ్యారు. దాదాపు ఆరువేల మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. 384 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతయ్యారు. వారిలో 31 మంది భారతీయులు ఉన్నారు. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వరదలతో ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ క్రమంలో నేపాల్ ప్రధాని బాలెన్షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. నేపాల్కు సహాయక సామాగ్రిని పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్ఫోర్స్ విమానాలతో పాటు , C-130 రవాణా విమానాల్లో రిలీఫ్ మెటీరియల్ను పంపిస్తున్నారు.
ప్రధాని మోదీ ట్వీట్..
‘‘నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. ఈ క్లిష్ట సమయంలో నేపాల్లోని మా సోదర సోదరీమణులకు భారతీయులందరూ అండగా నిలుస్తారు. నేపాల్కు సాధ్యమైనంత మేర మానవతా దృక్పథంతో కూడిన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది. సహాయక, పునరావాస చర్యల విషయంలో మా బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు.
Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time.
India is ready to provide all possible humanitarian…
— Narendra Modi (@narendramodi) August 26, 2026
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో..
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. రసువా దగ్గర బోటే కోశీ నదికి సునామీ లాగా వరద ఉధృతి వచ్చింది. జనం ప్రాణభయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. భారీ భవనాలు వరదలో కొట్టుకుపోయాయి. టూరిస్టుల వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. గీలోంగ్ పోర్ట్ ల్యాండ్ క్రాసింగ్ దగ్గర భవనాలు నేలమట్టమయ్యాయి. నాలుగు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
12 హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు కూడా కొట్టుకుపోయాయి. ప్లాంట్ దగ్గర పనిచేస్తున్న 15 మంది గల్లంతయ్యారు. బోటే కోశీ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రసువాలో 384 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. వాళ్లను కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన పర్యాటకుల్లో 311 మంది విదేశీయులు ఉన్నారు. రసువాతో పాటు నుసువా కోట్ , దాదీడ్ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
టిబెట్లో మంచు పర్వతాలు కరగడంతో ఆకస్మిక వరదలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. నేపాల్ సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా కొత్తగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. 12 హెలికాప్టర్లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల కారణంగా ఇప్పటివరకు 8 మంది చనిపోయినట్టు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వరదలతో నేపాల్ కేబినెట్ అత్యవసరంగా భేటీ అయ్యింది. వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటునట్టు ప్రకటించింది. సహాయక శిబిరాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా భారత సరిహద్దు జిల్లాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
