PM Modi: యుద్ధంతో నష్టం.. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ, అంతరిక్ష రంగంలో యువత సాధించిన విజయాలు, రాజస్థాన్లో ఆయిల్ రిఫైనరీ ప్రారంభం, సెమీకండక్టర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ రైలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయిందని.. స్కైరూట్ సక్సెస్ కావడం దేశానికి గర్వకారణం అని మోదీ పేర్కొన్నారు. 28 ఏళ్ల యువకులు ఈ ఘనతను సాధించారన్నారు. యువత సాహసాలు చేయడమే కాదు, సక్సెస్ అవుతున్నారని మోదీ తెలిపారు. రాజస్థాన్లో ఆయిల్ రిఫైనరీని దేశానికి అంకితంచేశామని.. సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రారంభించుకున్నామని.. గ్రీన్ హైడ్రోజన్ రైలు ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వర్షాకాలం.. వర్షాకాల సమావేశాలు అయినా – రెండూ కార్యసాధకంగా ఉంటే, అవి అత్యంత ఫలవంతంగా ఉంటాయని మోదీ పేర్కొన్నారు. రెండూ ఫలవంతంగా ఉన్నప్పుడు, అది దేశ సంక్షేమానికి, సకల జీవుల శ్రేయస్సుకు దారితీస్తుంది. అందుకే వర్షాకాలం కార్యసాధకంగా, ఫలవంతంగా ఉండాలని, వర్షాకాల సమావేశాలు కూడా ఫలవంతంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము… అని మోదీ పేర్కొన్నారు.
యుద్ధం వల్ల చాలా దేశాలకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయని వివరించారు. మన దేశం 7.7 శాతం గ్రోత్రేట్ నమోదు చేస్తోందన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగాలని కోరుతున్నా.. అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. అని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Delhi: On the Monsoon session of Parliament, PM Narendra Modi says, “Be it the monsoon or the monsoon session- if both are proactive, they prove to be highly productive. And when both are productive, it leads to the welfare of the nation and the well-being of all living… pic.twitter.com/xuQmzDTeQw
— ANI (@ANI) July 20, 2026
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై.. ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి.. ఇవాళ సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి.వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి మూడేళ్ల వరకు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
గత ఏప్రిల్లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ లభించక వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈసారి ఎలాగైనా పాస్ చేయించాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును కలిపి ఒకే అంశంగా మార్చి సభ ముందుకు తెస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు కోసమే బీజేపీ ‘మిషన్ 360’పై NDA ఫోకస్ పెట్టింది. సభలో హాజరయ్యే సంఖ్యా బలం ఆధారంగా 2/3 మెజారిటీ మారుతుంది కాబట్టి.. 360 మంది ఎంపీలను టార్గెట్గా పెట్టుకుంది. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
