సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తోంది..! పార్లమెంట్ సాక్షిగా పాకిస్థాన్ ఎంపీ సంచలన స్టేట్మెంట్
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. భారతదేశం చేసిన దాడులతో పాకిస్తాన్ వణుకుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో దేశంలో రాజకీయ అశాంతి పెరిగింది. పాకిస్తాన్ ఎంపీలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

ఒక వైపు భారత్ దాడులతో పాకిస్థాన్ చిగురుటాకులా వణికిపోతుంటే.. మరోవైపు స్వదేశంలో పాక్ ప్రభుత్వానికి తల నొప్పి తప్పడం లేదు. భారత్ దాడులతో విరుచుకుపడుతుంటే.. పీటీఐ పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని నిరసనలు చేపట్టారు. తాజాగా పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను తీవ్రంగా విమర్శించారు. షెహబాజ్ “పిరికివాడు” అని అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో టిప్పు సుల్తాన్ చెప్పిన ఒక కోట్ను ప్రస్తావించారు.. “సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, వారు పోరాడలేరు, వారు యుద్ధంలో ఓడిపోతారు.”
“సరిహద్దులో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారు, కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు, మోడీ పేరును తీసుకోలేనప్పుడు, ముందు వరుసలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి మనం ఏ సందేశం పంపుతున్నాం?” అని షాహిద్ విమర్శించారు. అంతకుముందు ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని “యా ఖుదా, ఆజ్ బచా లో” (ఓ దేవా, ఈ రోజు మమ్మల్ని రక్షించు) అని వేడుకుంటున్న వీడియో వైరల్ అయింది.
దేశాన్ని చుట్టుముట్టిన అశాంతి గురించి ఆందోళన చెందుతూ ఆయన దేవుడి రక్షణ కోసం ప్రార్థించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ప్రారంభించిన అత్యంత తీవ్రమైన సైనిక ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్లో భయాందోళన వాతావరణం నెలకొంది. పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్త స్థితికి చేరుకున్నాయి. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..