NCERT: పిరియాడిక్ టేబుల్ను ఆ కారణంతోనే తొలగించాం.. క్లారీటీ ఇచ్చిన ఎన్సీఈఆర్టీ
పదో తరగతిలో సైన్స్ సిలబస్ నుంచి ఎన్సీఈఆర్టీ పిరియాడిక్ టేబుల్ను తొలగించగించిన విషయం తెలిసిందే. సిలబస్ను హేతుబద్ధీకరణలో భాగంగా పదవ తరగతిలో మరిన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది.
పదో తరగతిలో సైన్స్ సిలబస్ నుంచి ఎన్సీఈఆర్టీ పిరియాడిక్ టేబుల్ను తొలగించగించిన విషయం తెలిసిందే. సిలబస్ను హేతుబద్ధీకరణలో భాగంగా పదవ తరగతిలో మరిన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. సైన్స్ సిలబస్ నుంచి పిరియాడిక్ టేబుల్, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, అలాగే డెమోక్రటిక్ పాలిటిక్స్-1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు లాంటి పాఠాలను తొలగించింది. అయితే, భారత్లో సైన్స్ను తప్పనిసరి పాఠ్యాంశంగా 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తారు. ఆ తర్వాత సైన్స్ గ్రూప్ చదివే విద్యార్థులకు మాత్రమే తొలగించిన పాఠ్యాంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ముఖ్యమైన పిరియాడిక్ టేబుల్ వంటి పాఠ్యాంశాలను పదో తరగతి సైన్స్ పుస్తకాల నుంచి తొలగించడంపై పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ వివరణ ఇచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ కరికులమ్ నుంచి దీన్ని పూర్తిగా తొలగించలేదని..11, 12వ తరగతుల్లో ఈ సమాచారం ఉంటుందంటూ పేర్కొంది. కొవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు నేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. విద్యార్థులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సిలబస్ను దశల వారీగా హేతుబద్ధీకరించినట్లు తెలిపింది. ఎన్సీఈఆర్టీ ఫ్యాకల్టీ, సీబీఎస్ఈ ప్రాక్టీసింగ్ టీచర్లు, ఇతర నిపుణుల నుంచి చర్చలు జరిపిన తర్వాతే పాఠ్యాంశాలను తొలగిస్తున్నామని పేర్కొంది. ఒక క్లాసుకు చెందిన వేర్వేరు సబ్జెక్టుల్లో ఒకే కంటెంట్ ఉంటే దాన్ని తీసేస్తున్నామని చెప్పింది. అలాగే ఒక సబ్జెక్టులో కింది, పైతరగతుల్లో ఒకే విషయం ఉన్నా తొలగిస్తున్నామని.. ప్రస్తుత పరిస్థితులకు అవసరం లేని పాఠ్యాంశాలను తీసివేస్తున్నామని తెలిపింది. ఇప్పుడు పిరియాడిక్ టేబుల్ తొలగింపు విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందని పేర్కొంది. 11, 12వ తరగతుల్లో సైన్స్ను ఎంచుకున్న విద్యార్థులు పిరియాడిక్ టేబుల్ గురించి తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి