AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. శరద్ పవార్ విందుకు సీఎం ఏక్‌నాథ్ దూరం..!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతోంది. ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ తన రాజకీయ ప్రత్యర్థుల కోసం విందు ఆహ్వానం పంపారు. అయితే ఈ విందుకు హాజరుకాలేనంటూ శరద్ పవార్ ఆహ్వానాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తిరస్కరించారు.

Maharashtra: మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. శరద్ పవార్ విందుకు సీఎం ఏక్‌నాథ్ దూరం..!
Eknath Shinde, Sharad Pawar
Janardhan Veluru
|

Updated on: Mar 01, 2024 | 5:47 PM

Share

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతోంది. ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ తన రాజకీయ ప్రత్యర్థుల కోసం విందు ఆహ్వానం పంపారు. అయితే ఈ విందుకు హాజరుకాలేనంటూ శరద్ పవార్ ఆహ్వానాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తిరస్కరించారు. ఈ విందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌తో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌లను పవార్ ఆహ్వానించారు. పుణె జిల్లాలోని బారామతిలో ఈ నెల మార్చి 2న(శనివారం) జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు హాజరుకానున్నారు.

బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మళ్లీ ఆమె అక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే బారామతి నుంచి ఎన్డీయే కూటమి తరఫున తన భార్య సునేత్ర పవార్‌ను బరిలో నిలిపే యోచనలో అజిత్ పవార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు బారామతికి వస్తున్న వేళ.. శరద్ పవార్ విందు ఆహ్వానం పలకడం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బారామతి ఎంపీ హోదాలో సుప్రియ సూలే, రాజ్యసభ సభ్యుడైన తాను కూడా బారామతిలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటామని శరద్ పవార్ తెలిపారు. ఆ కార్యక్రమం అనంతరం బారామతిలోని తన నివాసంలో విందుకు రావాలని షిండే, ఫడ్నవీస్, అజిత్‌లకు శరద్ పవార్ ఆహ్వాన లేఖలు పంపారు. ముఖ్యమంత్రి షిండే తొలిసారిగా బారామతి పర్యటనకు వస్తున్నందున ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విందుకు హాజరుకాలేనని సీఎం షిండే శుక్రవారంనాడు స్పష్టంచేశారు.

అజిత్ పవార్‌తో కలిసి ఎన్సీపీ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరడం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అజిత్ పవార్ వర్గానికే ఎన్సీపీ అధికార చిహ్నం గడియారంను కేటాయించింది. అటు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించారు. దీనిపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఇదిలా ఉండగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను మళ్లీ పోటీ చేయనున్నట్లు సుప్రియ సూలే ప్రకటించుకున్నారు. ఆ మేరకు ఆమె శుక్రవారంనాడు తన వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.