మైనర్ బాలుడి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. శరీరంలోని ఆ భాగం ఎక్కడ?
మధ్యప్రదేశ్లోని భోపాల్లో 17 ఏళ్ల బాలుడి హత్య కేసు సంచలనం రేపుతోంది. మృతదేహంలోని ఒక కీలక భాగం అదృశ్యమవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక రూ.2 కోట్ల అవయవ విక్రయ డీల్ ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన బాలుడి అదృశ్యం, హత్యోదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 17 ఏళ్ల బాలుడి హత్య కేసు సంచలనం రేపుతోంది. బాలుడిని హత్య చేసి.. అతడి శరీరంలోని ఓ భాగాన్ని విదేశాలకు విక్రయించేందుకు కుట్ర చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.2 కోట్ల డీల్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు, అనుమానాలపై పూర్తి నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మృతుడు కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడు. మోతీ మసీదు, ఇక్బాల్ మైదాన్ పరిసర ప్రాంతాల్లో పెన్నులు, నోట్బుక్స్ విక్రయిస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. బాలుడి సంపాదనతోనే కుటుంబం జీవనం సాగించేది. ఆగస్టు 6న బాలుడు అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అతడి కోసం గాలింపు కొనసాగుతుండగా.. ఆగస్టు 11న ఛోటా తలాబ్ సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యులు బాలుడి చెప్పులు, దుస్తులను పరిశీలించారు. అవి తమ కుమారుడివేనని గుర్తించడంతో విషాదం నెలకొంది. అనంతరం పోలీసులు అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ప్రారంభించి హత్య కేసుగా నమోదు చేశారు.
అయితే దర్యాప్తులో బాలుడి శరీరంలోని ప్రైవేట్ పార్ట్ కనిపించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. ఆ భాగం ఎక్కడికి వెళ్లింది? హత్యకు దానికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శరీర భాగాన్ని విదేశాలకు విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు కుట్ర జరిగిందన్న అనుమానంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి సుమారు 13 మంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మైనర్ల ప్రమేయం ఉందా? ఏదైనా సంఘటిత ముఠా ఈ ఘటన వెనుక ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఛోటా తలాబ్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కనిపించని శరీర భాగం కోసం కూడా సెర్చ్ చేస్తున్నారు.
శ్యామ్లా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై భోపాల్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి హత్య వెనుక అసలు కారణమేంటి? శరీర భాగం ఎందుకు కనిపించకుండా పోయింది? రూ.2 కోట్ల డీల్ నిజమేనా? ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
