కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షల మోత.. ఆ నాలుగు చోట్ల క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్పై నిషేధం!
కాశ్మీర్లో పెరుగుతున్న పర్యాటకుల రద్దీ కారణంగా దెబ్బతింటున్న అటవీ ప్రాంతాలను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్, బోన్ఫైర్లు, ప్లాస్టిక్ వినియోగంపై తక్షణమే నిషేధం విధించింది. ఈ ప్రాంతాలను 'జీరో వేస్ట్ జోన్లుగా' అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అటవీ శాఖ, యాంటీ-పాలిథీన్ చెక్పోస్టులు, వారాంత పారిశుద్ధ్య కార్యక్రమాలు, పర్యావరణహిత వ్యర్థాల నిర్వహణ వంటి చర్యలను చేపట్టనుంది.

కాశ్మీర్ లోయలోని పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పర్యాటకుల తాకిడితో దెబ్బతింటున్న అటవీ ప్రాంతాలను రక్షించేందుకు దూద్పత్రి, యూస్మార్గ్ సహా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్, బోన్ఫైర్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటకుల సందడితో కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న అటవీ ప్రాంతాలను ‘జీరో వేస్ట్ జోన్లుగా’ మార్చేందుకు అటవీ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దూద్పత్రి, యూస్మార్గ్, తోసామైదాన్, హాజిన్-బ్రెన్వార్ ప్రాంతాల్లో ఇకపై పర్యాటకులు ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
నిషేధిత కార్యకలాపాలివే:
పర్యావరణానికి హాని కలిగించే అనేక పనులపై అటవీ శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది:
1. క్యాంపింగ్ & టెంట్లు: అటవీ ప్రాంతాల్లో టెంట్లు వేసుకోవడం లేదా క్యాంపింగ్ చేయడంపై నిషేధం.
2. ఆఫ్-రోడింగ్: అడవుల్లో వాహనాలను ఇష్టానుసారంగా నడపడం (Off-roading) పూర్తిగా నిషిద్ధం.
3. బోన్ఫైర్లు: అడవుల్లో మంటలు వేయడం లేదా బోన్ఫైర్లు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు.
4. ప్లాస్టిక్ రహిత జోన్లు: ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ‘యాంటీ-పాలిథీన్ చెక్ పోస్టులను’ ఏర్పాటు చేయనున్నారు. ప్లాస్టిక్ వాడకం, విక్రయాలు, నిల్వ చేయడం చట్టరీత్యా నేరం.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం:
ఈ పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది:
ప్రజా చైతన్యం: పర్యాటకులకు వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాల (క్లాత్ బ్యాగులు) వాడకంపై అవగాహన కల్పిస్తారు.
వారపు పారిశుద్ధ్య డ్రైవ్: ప్రతి బుధవారం అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు, వాలంటీర్లతో భారీ స్థాయిలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈకో-ఫ్రెండ్లీ డస్ట్బిన్లు: చెత్తను శాస్త్రీయంగా సేకరించేందుకు అవసరమైన చోట్ల డస్ట్బిన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కనీసం వారానికి రెండుసార్లు క్లియర్ చేస్తారు.
కఠిన చర్యలు తప్పవు:
అటవీ శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. “రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో అటవీ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసే ఏ చర్యను సహించేది లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే జమ్మూ-కాశ్మీర్ నాన్-బయోడిగ్రేడబుల్ మెటీరియల్ యాక్ట్-2007, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని అధికారులు స్పష్టం చేశారు.
పర్యాటకుల తాకిడి పెరగడం పర్యావరణానికి ఏ విధంగా ముప్పుగా మారుతుందో గుర్తించిన అటవీ శాఖ, ఈ నిర్ణయం ద్వారా పర్యాటకాన్ని సుస్థిరమైన (Sustainable Tourism) మార్గంలో తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఇకపై ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
