CJI Lalit: నూతన సీజేఐగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం.. ఆయన ప్రస్థానం ఇదే.!
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ కొలువు తీరారు. 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ కొలువు తీరారు. 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా లలిత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కొందరు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
ఉదయ్ ఉమేష్ ప్రస్థానం ఇదే.!
న్యాయవాదిగా జస్టిస్ లలిత్ ప్రస్థానం చూస్తే చాలా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది. గ్రౌండ్ లెవల్ నుంచి ఎదిగొచ్చి… అత్యున్నత పీఠం అధిష్టించిన నేపథ్యం ఆయనది. ముంబై గవర్నమెంట్ లా కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ తీసుకున్న జస్టిస్ లలిత్.. 1983లో బాంబే, గోవాలో అడ్వొకేట్గా ఎన్రోల్ అయ్యారు. బాంబే హైకోర్టులో రెండేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1986 జనవరిలో తన ప్రాక్టీస్ని ఢిల్లీకి మార్చారు. 2004లో సీనియర్ అడ్వొకేట్గా గుర్తించింది సుప్రీంకోర్టు. 2011లో 2జీ స్ప్రెక్టం కేసులో సీబీఐ తరపున వాదనలు వినిపించారాయన. 2014లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. బార్ నుంచి నేరుగా సీజేఐగా నియమితులైన వ్యక్తుల్లో జస్టిస్ లలిత్ రెండో వారు.
న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లలిత్కి ఘనమైన రికార్డే ఉంది. గతంలో ట్రిపుల్ తలాక్ వంటి కీలక కేసుల్లో ల్యాండ్మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చిన బెంచ్లలో జస్టిస్ లలిత్ భాగస్వామ్యం ఉంది. 2017లో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధించిన బెంచ్లో జస్టిస్ లలిత్ కూడా ఒకరు. ఇప్పుడు సీజేఐగా కూడా ఆయన అనేక కీలక కేసుల విచారణ చేపట్టబోతున్నారు. 490 పెండింగ్ కేసుల పరిష్కారం కోసం కొత్త ధర్మాసనాల్ని ఏర్పాటు చేసే ఆవకాశముంది.
జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సీజేఐగా వచ్చారు యుయు లలిత్. కానీ… నవంబర్ 8కి 65 ఏళ్లు పూర్తవడంతో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో జస్టిస్ లలిత్ అతికొద్దికాలమే… అంటే కేవలం 74 రోజులు మాత్రమే ఈ అత్యున్నత పదవిలో కొనసాగే అవకాశముంది.